ఉదయం 9.30 గంటలకు వ్యాపార దుకాణాలు మూసివేయాలని నిర్ణయం
10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాల తనిఖీ
తొమ్మిదో రోజూ లాక్డౌన్ విజయవంతం
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ):లాక్డౌన్ నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నెల 30 వరకు పొడిగించడంతో ఆంక్షలు పక్కాగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. కూరగాయల మార్కెట్లు, వ్యాపార సముదాయాలు ఉదయం 6-10 గంటల వరకు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడళ్లు, ప్రధాన రహదారులపైకి వచ్చేవారి వాహనాలను సీజ్ చేయడం, సైరన్ మోగించడంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. శుక్రవారం నుంచి 9.30-9.45 గంటల మధ్యే వ్యాపార దుకాణాలు మూసి వేసి, 10 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లాలో పూర్తిస్థాయిలో అమలవుతున్నది. పోలీస్ అధికారులు ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై పహారా కాస్తూ వ్యాపార సముదాయాలన్నింటినీ మూసి వేయిస్తున్నారు. పది గంటలు దాటిన తరువాత ఒక్క వాహనం కూడా రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సరైన కారణాలు లేకుండా ఉదయం పది గంటల తరువాత రోడ్లపైకి వచ్చే వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా, సరైన కారణాలు లేకుండా రోడ్లపైకి వస్తే వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. గురువారం జిల్లాలో 10 గంటల తరువాత పోలీసులు కఠిన ఆంక్షలను అమలు చేశారు. 10 తరువాత రోడ్లపైకి వచ్చే వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. వాహనదారులు బయటకు ఎందు వచ్చారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలో అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర్ రావు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని ఆపుతూ వాహనదారుల వివరాలు తెలుసుకున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలు జరిగేలా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు
9.30గంటలకే బంద్ చేయాలి
ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో వ్యాపారులు ఉదయం 10 గంటల తరువాత దుకాణాలను మూసివేస్తున్నారు. దీంతో ప్రధాన మార్కెట్లు, మండల కేంద్రాల్లో వ్యాపారాలు మూసివేసే సరికి 11 గంటలవుతున్నది. దీంతో జనం రోడ్లపై గుంపులుగుంపులుగా కనిపిస్తున్నారు. దీనిని నివారించేందుకు ఉదయం 9.30 నుంచి 9.45 గంటల మధ్యే మూసివేసి,10 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. శుక్రవారం నుంచి ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై కనిపించే వాహనదారులపై కేసులు నమోదు చేయడంతోపాటు, వ్యాపారులు తమ దుకాణాలను తెరిచి ఉంచినైట్లెతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. జిల్లాలో శుక్రవారం నుంచి వ్యాపార సముదాయాలు, మార్కెట్లు ఉదయం 9.45 గంటల వరకే పనిచేయనున్నాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏఎస్పీ అచ్చేశ్వరరావు వాహనాలను తనిఖీ చేశారు. లాక్డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ప్రయాణికులకు సూచించారు. ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై కనిపించే వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు ప్రధాన మార్కెట్ కూడళ్లలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర పర్యటించారు. అనవసరంగా బయట తిరిగే వాహనదారులను గుర్తించి వాహనాలను తాత్కాలి కంగా జప్తు చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్లలో మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ పర్యటించారు. డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలతో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నామని తెలి పారు. శ్రీరాంపూర్ ఏరియా ఇందారం చౌరస్తా వద్ద జైపూర్ ఏసీసీ నరేందర్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్, ఈద్గాం, మంచిర్యాల చౌరస్తా వద్ద లాక్డౌన్ అమలు తీరును ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్ పరిశీలించారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం, పోలీస్ యంత్రాగం, అధికారులు నిద్రాహారాలు మాని విధులు నిర్వహిస్తున్నారని, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాని కోరారు.