న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. దాదాపు నెలన్నర తర్వాత ఐదువేలకు దిగువన తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో వైపు పాజిటివిటీ రేటు సైతం 10శాతం కంటే తక్కువగా పడిపోయింది. గత కొన్ని వారాల్లో కొవిడ్ పరీక్షలు సైతం తగ్గినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కోరారు. ఢిల్లీలో 24 గంటల్లో 4,524 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 5వ తేదీ తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కేసులు తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 340 మరణాలు రికార్డయ్యాయని ప్రభుత్వం హెల్త్ బులిటెన్లో తెలిపింది.
24 గంటల్లో 53,756 టెస్టులు నిర్వహించినట్లు పేర్కొంది. గత నెలలో 30శాతానికి పైగా ఉన్న పాజిటివిటీ రేటు 24 గంటల్లో 8.42శాతానికి పడిపోగా.. ఏప్రిల్ 8 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయికి చేరింది. తాజాగా నమోదైన కేసులతో ఢిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13.98లక్షలు దాటగా.. 13.20లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 21,846 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 56,049 యాక్టివ్ కేసులు ఉండగా.. 35,141 హోం ఐసోలేషన్లో ఉన్నారు.