కీసర,మే 8: మండల పరిధిలోని చీర్యాల్ లక్ష్మీనర్సింహాస్వామివారి ఆలయం వార్షికోత్సవాన్ని శనివారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ఆలయ గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణమందిరంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణం నిర్వహించగా మంత్రి దంపతులు బ్యాండ్ మేళాలతో పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చీర్యాల్ లక్ష్మీనర్సింహాస్వామి గొప్ప మహిమగల దేవుడని మంత్రి అన్నారు. అనతికాలంలో ఈ పుణ్యక్షేత్రం భక్తుల మన్ననలు పొందిందన్నారు.అనంతరం మంత్రి దంపతులను ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, ఆలయ ధర్మకర్త శ్రీహరిగౌడ్, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ ఘనంగా సన్మానించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, చీర్యాల్ సర్పంచ్ ధర్మేందర్, పలు గ్రామాల టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.