న్యూఢిల్లీ, మే 7: ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మందిని కబళిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించే పరీక్షను భారత శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. చిన్న రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ను గుర్తించడంతోపాటు అది ఏ దశలో ఉన్నదో కూడా 100% కచ్చితత్వంతో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరీక్షను హెచ్ఆర్సీగా పిలుస్తున్నారు. ముంబైకి చెందిన ఎపిజెనెరిస్ బయోటెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్కి చెందిన జార్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. ముంబైకి చెందిన నానోటెక్ శాస్త్రవేత్త వినయ్కుమార్ త్రిపాఠి, ఆయన కుటుంబానికి ఈ రెండు కంపెనీల్లోనూ మెజార్టీ షేర్లు ఉన్నాయి. హెచ్ఆర్సీ పరీక్ష ద్వారా 25 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చని, కణతి అభివృద్ధి చెందకమునుపే క్యాన్సర్ను కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘చిన్న రక్త పరీక్ష ద్వారా అన్ని రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించవచ్చు. క్యాన్సర్కు ప్రపంచంలోనే తొలి ప్రొగ్నోస్టిక్ (ముందుగానే గుర్తించే) టెస్ట్ ఇదే’ అని జార్ ల్యాబ్ సీఈవో ఆశిష్ త్రిపాఠి తెలిపారు. ఏడాదికి ఒకసారి హెచ్ఆర్సీ పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను మొదటి దశలో లేదా ముందుగానే గుర్తించేందుకు వీలవుతుందని వెల్లడించారు.