కేపీహెచ్బీ కాలనీ, మే 4 : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా సమయంలో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడం, స్వల్పంగా కరోనా లక్షణాలు కల్పిస్తే సాధారణ మందులు, హోమ్ ఐసోలేషన్తో కోలుకునే అంశాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా ఇంటింటి సర్వేను ప్రారంభించి జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలున్న వారికి కరోనా కిట్లను పంపిణీ చేయడం.. సమస్య తీవ్రంగా ఉంటే కొవిడ్ కేంద్రాలకు తరలించేలా చర్యలు ప్రారంభించారు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వారికి ఆరోగ్య సలహాలు అందించేందుకు ప్రభుత్వ బస్తీ దవాఖానలు, ఆరోగ్య కేంద్రాలలో ఔట్ పేషెంట్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. సమస్య తీవ్రతను బట్టి సర్కిల్కు ఒకటి చొప్పున కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు కూకట్పల్లి జోనల్ అధికారులు చెబుతున్నారు.
కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 74 బృందాలు ఫీవర్ సర్వేలో పాల్గొన్నాయి. మూసాపేట సర్కిల్లో 21, కూకట్పల్లి సర్కిల్లో 24, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 12, గాజులరామారం సర్కిల్లో 6 బృందాలు సర్వే చేస్తున్నాయి. ఒక బృందంలో ఆశ వర్కర్, ఏఎన్ఎం, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది ఉంటారు. రెండురోజుల ఫీవర్ సర్వేలో 5694 ఇండ్లలో సర్వే చేయగా 189 మందికి కరోనా కిట్లను పంపిణీ చేశారు. సర్కిల్ వారీగా పరిశీలిస్తే మూసాపేట సర్కిల్లో 2202, కూకట్పల్లి సర్కిల్ 2427, కుత్బుల్లాపూర్ సర్కిల్ 105, గాజులరామారం సర్కిల్ 290, అల్వాల్ సర్కిల్లో 668 ఇండ్లలో సర్వేను పూర్తి చేశారు. ఈ సర్వేలో కేవలం 189 ఇండ్లలో మాత్రమే జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉన్నాయని చెబితే వారికి కరోనా కిట్లను అందజేసి హోమ్ ఐసోలేషన్లో పాటించాల్సిన నియమాలను వివరించారు. కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ అవకాశం లేనివారికోసం కొవిడ్ కేర్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. సర్కిల్కు ఒకటి చొప్పున ఫంక్షన్హాళ్లను కొవిడ్ కేర్ సెంటర్లుగా మారుస్తున్నారు. మూసాపేట సర్కిల్లో ఎన్కేఎన్ఆర్ గార్డెన్, కూకట్పల్లిలో నైనా గార్డెన్, కుత్బుల్లాపూర్లో పీఎస్ఆర్ ఫంక్షన్హాల్, గాజులరామారంలో ఎంపీఆర్ కన్వెన్షన్, అల్వాల్లో శోభా గార్డెన్లను సిద్ధం చేస్తున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కూకట్పల్లి జోన్లో 40 కొవిడ్ ఔట్ పేషెంట్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. బస్తీ దవాఖానలు, ఆరోగ్య కేంద్రాలలో ఔట్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసి అవసరమైన వారికి మాత్రమే కరోనా టెస్టులు చేయడం.. అవసరం లేనివారికి టాబ్లెట్లను ఇచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. జోన్ పరిధిలోని మూసాపేట సర్కిల్ 10, కూకట్పల్లి సర్కిల్ 10, కుత్బుల్లాపూర్ సర్కిల్ 7, గాజులరామారం సర్కిల్ 7, అల్వాల్ సర్కిల్లో 6 కేంద్రాలలో ఔట్ పేషెంట్ సేవలు అందుబాటులోకి తెచ్చారు.
కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేస్తున్నాం. రెండ్రోజుల్లో సుమారు 6వేల ఇండ్లలో సర్వే జరుగగా 189 కిట్లను పంపిణీ చేశాం. బస్తీ దవాఖానలను, ఆరోగ్య కేంద్రాలలో స్పెషల్ శానిటైజేషన్ చేయడంతో పాటు ఔట్ పేషెంట్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల్లో కరోనా భయాలను తొలగించడం.. కరోనా సోకిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. మరోవైపు కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ.. మాస్కులు ధరిస్తూ జాగ్రత్తగా ఉండాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యుల సలహాలు తీసుకుంటే సరిపోతుంది.