హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం లక్షల మంది గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నింపింది. సాఫీగా సాగిన ఈ పథకానికి ఇప్పుడు ధరల రూపంలో చిన్న సమస్య ఎదురైంది. ధరలు పెరగటంతో ప్రస్తుత ధరలో యూనిట్ గొర్రెలను కొనుగోలు చేయడం అధికాలకు కష్టంగా మారుతున్నది. డీలర్లు సైతం ప్రస్తుతం ఉన్న (రూ.1.25 లక్షలు) ధరకు 21 గొర్రెలను పంపిణీ చేసేందుకు ఒప్పుకోవటం లేదు. ఈ నేపథ్యంలో యూనిట్ ధరను పెంచాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ సమస్యను మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లిన అధికారులు.. త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. యూనిట్ ధర పెంపునకు సీఎం ఆమోదం తెలిపితే రెండో విడుత గొర్రెల పంపిణీకి కొత్త రేట్లను ఖరారు చేయనున్నారు. యూనిట్ ధరను రూ.1.40 లక్షలుగా నిర్ణయించే అవకాశం ఉన్నది. అటు.. రెండో విడుత గొర్రెల పంపిణీని జూలై చివరి నుంచి ప్రారంభించేందుకు పశు సంవర్థకశాఖ కసరత్తు చేస్తున్నది. మొదటి విడుతలో ఇప్పటికే 3,66,373 మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ పూర్తికాగా 28,335 మందికి పంపిణీ కొనసాగుతున్నది. రెండో విడుతలో 3,36,864 మందికి గొర్రెల పంపిణీ చేయాల్సి ఉన్నది.