న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే శుక్రవారం పదవీ విరమణ చేశారు. ‘నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నా అత్యుత్తమ పనితీరు కనబర్చాను. ఇతరులు ఏం అనుకొంటున్నారు.. ఎలా అర్థం చేసుకొన్నారన్నది నాకు తెలియదు’ వీడ్కోలు సమావేశంలో అన్నారు. 47వ సీజేఐగా 2019 నవంబర్లో పదవీ స్వీకారం చేసిన ఆయన తన 17 నెలల పదవీ కాలంలో ఎన్నో కీలక తీర్పులు ఇచ్చారు. అయోధ్య, సమాచార గోప్యత, సీఏఏపై పిటిషన్లు, టాటా-మిస్త్రీ కేసు, తాత్కాలిక జడ్జిల నియామకం ఇలా పలు అంశాల్లో ఆయన చరిత్రాత్మక తీర్పులను వెలువరించారు. శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వర్చువల్గా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో, అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. 21 ఏండ్ల పాటు జడ్జిగా సేవలందించిన తాను.. కోర్టులో సహచర జడ్జిల ద్వారా అత్యంత విలువైన అనుభవాన్ని సాధించానని చెప్పారు. సంతృప్తితో తన పదవికి వీడ్కోలు పలుకుతున్నానని తెలిపారు. ‘సంతోషం, సద్భావం, ఎన్నో జ్ఞాపకాలతో సంతృప్తిగా పదవీవిరమణ చేస్తున్నా. నా శాయశక్తులా కృషి చేశాను’ అని బోబ్డే అన్నారు. పదవిలో చివరి రోజున మాటల్లో చెప్పలేని ఎన్నో మిశ్రమ భావనలు కలుగుతున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు 48వ ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నానని, ఆయన సమర్థంగా నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. 47వ ప్రధానన్యాయమూర్తిగా 2019 నవంబర్లో బాధ్యతలు చేపట్టిన బోబ్డే.. ఎన్నో కీలక తీర్పులను వెలువరించారు. అందులో అయోధ్య తీర్పు చారిత్రాత్మకమైనది. కొవిడ్ వ్యాపించిన దుర్భర పరిస్థితుల్లోనూ సాంకేతికతను ఉపయోగిస్తూ వీడియోకాన్ఫరెన్స్ల ద్వారా తీర్పులు ఇచ్చి, న్యాయవ్యవస్థకు ఆటంకం కాకుండా చర్యలు తీసుకున్నారు.
కొవిడ్ ఉద్ధృతి ఎంత ఉన్నా సుప్రీంకోర్టు ఒక్కరోజు కూడా మూతపడలేదని జస్టిస్ బోబ్డే గుర్తుచేశారు. కరోనా సంక్షోభంలోనూ కోర్టు అత్యుత్తమ పనితీరు కనబర్చిందన్నారు. సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు. ‘వర్చువల్ హియరింగ్ ఒక కొత్త రకమైన సమానత్వం, అసమానత్వాన్ని సృష్టించింది. ఇప్పుడు నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడను. వర్చువల్ హియరింగ్ సాంకేతికతపై ఆధారపడుతుంది. అంటే సాంకేతికత అందుబాటులో ఉంటేనే న్యాయం అందుబాటులో ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.