డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలకు నివారించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీని కోసం బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల నిర్వాహకుల సహకారాన్ని కోరుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులకు వచ్చే మందుబాబులను గమనించడంతో పాటు వారిలో డ్రైవింగ్ చేసే వారు మద్యం సేవించకుండా వారికి ట్రాఫిక్ నిబంధనలు వివరించాలని తెలిపారు. పూటుగా మద్యంసేవించిన వారిని డ్రైవింగ్ చేయకుండా అడ్డుకోవాలని, వారు ఇంటికి చేరుకునే విధంగా డ్రైవర్ను అందుబాటులో ఉంచాలని సూచించారు. మందుబాబులు వినకుంటే పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు. పార్కింగ్ వద్ద సెక్యూరిటీగా ఉండే వారు వాహనదారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి యాజమాన్యాన్ని అప్రమతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కింగ్తో పాటు ప్రవేశ ద్వారం వద్ద మద్యం సేవించి వాహనం నడపడం నేరమని బోర్డులు పెట్టాలని తెలిపారు. అయితే డ్రైవర్ను పంపినప్పుడు ఆ చార్జీలను మందు బాబులు చెల్లించుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల కిందట సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్ బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల యజమానులతో సమన్వయ సమావేశం నిర్వహించి ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా సైబరాబాద్ పరిధిలోని దాదాపు 150 బార్ అండ్ రెస్టారెంట్లకు ట్రాఫిక్ డీసీపీ ఆధ్వర్యంలో జాగ్రత్తలు పాటించాలని కోరుతూ నోటీసులు జారీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.