రూ.245కు పెంచుతూ సర్కారు జీవో
మొక్కల పెంపకానికీ రేట్ల నిర్ధారణ
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఉపాధిహామీ కూలీల రోజూవారీ కూలీని పెంచుతూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీచేశారు. పెరిగిన కూలీరేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం కూలీ రూ.235 ఇవ్వగా, ప్రస్తుతం ఆ రేటును రూ.245గా నిర్ధారించారు. తేలికపాటి నేలల్లో మినీ పేర్కొలేషన్ ట్యాంకు, రాక్ఫిల్ డ్యాంలు, ఎండిపోయిన బావుల రిచార్జి పనులకు క్యూబిక్ మీటర్కు రూ.178.06 ఇవ్వగా ఆ మొత్తాన్ని రూ.196- రూ.218 వరకు పెంచారు. గట్టి నేలల్లో రూ.225-239 వరకు, రాతి నేలల్లో రూ.264 దాకా ఇవ్వనున్నారు. ఇతర పనులకు సంబంధించిన రేట్లను కూడా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది.