విద్యానగర్, ఏప్రిల్ 16: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో చేపడుతున్న కొవిడ్ చికిత్సను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని తన చాంబర్లో జిల్లాలోని వైద్యాధికారులు, తహసీల్దార్లతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా చికిత్సలపై అన్ని ప్రభుత్వ దవాఖానలను డీఎంహెచ్వో, ప్రైవేటు దవాఖానలను డిప్యూటీ వైద్యాధికారులు, తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న నిఘా చర్యలు, భద్రతా అంశాలు, జరిమానాలకు సంబంధించిన కేసులను డీఎస్పీ, ఆర్డీవోలు ప్రతిరోజూ నివేదికల రూ పంలో సమర్పించాలని, సాఫ్ట్, హార్డ్ కాపీలను అందించాలన్నా రు. దవాఖానల్లో కొవిడ్ కేసులకు ఏరోజు ఎన్ని బెడ్లను వినియోగించారు..? ఎన్ని ఖాళీ ఉన్నాయి..? రోజు వారీ కొవిడ్ పాజిటివ్ కేసులు, పెండింగ్ వివరాలు, అందిస్తున్న చికిత్సను వివరంగా సమర్పించాలని ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎస్హెచ్వో, ఎంపీవో బృందాలను ఆర్డీవో, డీఎస్పీలు పర్యవేక్షిస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, డీఎంహెచ్వో చంద్రశేఖర్, ఏరియా దవాఖాన కో-ఆర్డినేటర్ డాక్టర్ అజయ్కుమార్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలి..
కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. జనహిత భవన్లో మెడికల్, రెవెన్యూ, పోలీసు అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామం, వార్డుల వారీగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. 24 గంటలు పనిచేసే కొవిడ్ కేర్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్లు నాలుగు సార్లు రోగులను పరీక్షించాలని సూచించారు. జిల్లాలో 45 ప్రైవేటు దవాఖానలకు కొవిడ్ చికిత్స కోసం అనుమతి లభించిందని, వారిలో సుమారు 450 బెడ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆర్డీవో శీను, డీఎంహెచ్వో చంద్రశేఖర్, ఏరియా దవాఖాన కో-ఆర్డినేటర్ అజయ్కుమార్, సీఐ వెంకట్ పాల్గొన్నారు.
మహారాష్ట్ర సరిహద్దులో ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో నిఘా..
బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 16: మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయంలో డీఎస్పీ, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్, డిప్యూటీ వైద్యాధికారి, పీహెచ్సీల వైద్యులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పోలీసు అధికారులతో కూడిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో కరోనా నియంత్రణ చర్యలపై డివిజన్లోని ఆరోగ్య కేంద్రాల వారీగా శుక్రవారం సమీక్షించారు. మద్నూర్, బిచ్కుంద సరిహద్దులోని 16 గ్రామాల్లో మద్నూర్ హైవేతో పాటు పీఆర్ రోడ్లు, బీటీ రోడ్లపై నిఘా పెంచాలన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారిని కచ్చితంగా ఏడు రోజుల పాటు ఐసొలేషన్లో ఉంచాలన్నారు. బాన్సువాడలో 50 బెడ్లు కొవిడ్ బాధితుల కోసం అందుబాటులో ఉంచామని, ఆరు ప్రైవేటు దవాఖానలను కూడా కొవిడ్ చికిత్స కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. వాటిలో 60 బెడ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రభుత్వ నిబంధనలను మూడుసార్లు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ జైపాల్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో మోహన్బాబు, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నరు.
ఇవీ కూడా చదవండీ…
కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట