వ్యాక్సిన్ వేసుకోవడానికి జనం బారులు
వృద్ధుల్లో వెల్లివిరిసిన చైతన్యం.. వేకువజామునే కేంద్రాలకు..
వ్యాక్సిన్ వేసుకుంటేనే మంచిదనే ప్రచారంతో ముందడుగు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దవాఖానల వద్ద బారులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిత్యం 10 వేల మందికి..
పల్లెలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం
ఆదిలాబాద్, ఏప్రిల్ 15 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా కరోనా పా జిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజుకు 700 నుంచి 800 కేసులు నమోదవుతుండగా, వైరస్ నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పిస్తూ జిల్లా, కమ్యూనిటీ దవాఖానలు, పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం సహకారం అందిస్తున్నారు. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
ఆదర్శంగా పల్లెలు..
ఉమ్మడి జిల్లాలో వ్యాక్సిన్ తీసుకోవడంలో పలు పల్లెలు ఆదర్శంగా axనిలుస్తున్నాయి. నిర్మల్ జిల్లా మథోల్ మండలం కారేగాంలో 45 ఏళ్లు దాటిన వారందరూ టీకా వేసుకున్నారు. చాలా గ్రామాల్లో అర్హులైన 50 శాతం మంది టీకా వేసుకోగా, వారిని చూసి మిగితావారు సైతం వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైద్యశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజు 10 వేల మందికి టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయగా, నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో పలు గ్రామాలు ఉండడం అక్కడ కేసులు బాగా పెరిగిపోవడంతో ఆ పల్లెల్లోని ప్రజలు ఎక్కువ సంఖ్యలో టీకా తీసుకుంటున్నారు. ఏజెన్సీలోనూ తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంతో కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొందని, టీకా విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంతో చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని, టీకా వేసుకుంటే కొవిడ్ నుంచి రక్షణ పొందవచ్చని వారు సూచిస్తున్నారు.