బడుగు, బలహీన వర్గాలకు అండ
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్
నగరంలో 14 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు
బాబాసాహెబ్ సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు
ఖమ్మం జడ్పీ సెంటర్కు అంబేడ్కర్ సెంటర్గా నామకరణం
మామిళ్లగూడెం, ఏప్రిల్ 14: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, దార్శనికుడు బీఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మంలోని జడ్పీ సెంటర్లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి దేశానికి రాజ్యాంగాన్ని అందజేసిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అలాగే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు..
మార్గదర్శకుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి ప్రపంచ దేశాల ఆర్థిక, రాజ్యాంగ విధానాలను అధ్యయనం చేసి దేశానికి రాజ్యాంగం అందజేశారన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించడంలో అంబేడ్కర్ కృషి మరువలేమన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేయాలన్నారు. దేశంలో ప్రతిఒక్కరికీ సమాన హక్కులను ప్రసాదించిన మహామనిషి అని కొనియాడారు. అంబేడ్కర్ను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు.
ఇక నుంచి జడ్పీ సెంటర్ను అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటర్గా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అంబేడ్కర్ కృషితోనే రాజ్యాంగం ద్వారా మంచి పరిపాలన అందుతుందన్నారు. జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ అంబేడ్కర్ అందించిన రాజ్యంగంతోనే మనం స్వేచ్ఛను అనుభిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ విష్ణు ఎస్ వారియర్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్జయంతి, జిల్లా ఎస్సీ సంక్షేమ ఉప సంచాలకుడు కస్తాల సత్యనారాయణ, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.