న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.5,076 కోట్ల నికర లాభాన్ని గడించినట్లు ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,321 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 17.5 శాతం అధికం. గడిచిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.1 శాతం ఎగబాకి రూ.26,311 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఇది రూ.23,267 కోట్లుగా ఉన్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. అలాగే రూ.9,200 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. షేరు ఒక్కింటికి రూ.1,750 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1,00,472 కోట్ల ఆదాయంపై రూ.19,351 కోట్ల నికర లాభాన్ని గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12 నుంచి 14 శాతం మేరకు వృద్ధి చెందవచ్చునని గైడెన్స్లో పేర్కొంది. గతేడాది అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఆపరేటింగ్ మార్జిన్లు, నగదు నిల్వలు పెరిగాయని తెలిపింది.
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఇన్ఫోసిస్ ప్రతి షేరుకు రూ.15 తుది డివిడెండ్ను ప్రకటించింది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా బుధవారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈ డివిడెండ్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో గతేడాది డివిడెండ్ రూపంలో రూ.27 చెల్లించినట్లు అవనున్నది. సంస్థ వద్ద నగదు నిల్వలు పుష్కలంగా ఉండటంతో గత రెండేండ్లలో రూ.15,600 కోట్ల నగదును వాటాదారులకు పంచనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో డివిడెండ్ రూపంలో రూ.6,400 కోట్లు, బైబ్యాక్ రూపంలో రూ.9,200 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. కంపెనీ షేరు ధర 1.91 శాతం తగ్గి రూ.1,398.60 వద్ద ముగిసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్తోపాటు విదేశాల్లో క్యాంపస్ల నుంచి 26 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు తెలిపారు. వీరిలో భారత్లో 24 వేల మందిని నియమించుకోనున్న సంస్థ.. మిగతా 2 వేల మందిని ఇతర దేశాల్లో రిక్రూట్ చేసుకోనున్నది. గతేడాది క్యాంపస్ల నుంచి 21 వేల మందిని రిక్రూట్ చేసుకున్నది. ప్రస్తుతం సంస్థలో 2,59,619 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సంస్థకు వచ్చిన మొత్తం ఆదాయంలో 50 శాతానికి పైగా వాటా కలిగిన డిజిటల్ రంగం 34 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. గతేడాదిలో సంస్థ 14 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడం కలిసొచ్చింది. అలాగే వలసలు 15 శాతానికి పైగా నమోదయ్యాయి.