లక్నో: పెండ్లికి రెండు వారాల ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లా నాయి మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ కాలనీలో ఈ ఘటన జరిగింది. బులంద్షహర్ జిల్లా జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్పూర్ గ్రామానికి చెందిన అఖిల్ కపాసియా 2016లో పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. మజఫర్నగర్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. సహ ఉద్యోగి కృష్ణ మావితో కలిసి ఆదర్శ్ కాలనీలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
కాగా, కృష్ణ బాత్ రూమ్లో ఉండగా అఖిల్ దేశీయ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గన్ పేలుడు శబ్దం విన్న కృష్ణ బాత్రూమ్ నుంచి వచ్చి చూడగా అఖిల్ రక్తం మడుగులోపడి ఉన్నాడు. ఆత్మహత్యకు ముందు అతడు తన మొబైల్ ఫోన్లో ఒక భావోద్వేగ వీడియోను కొందరికి పంపినట్లు తెలుస్తున్నది.
మరోవైపు కానిస్టేబుల్ అఖిల్కు అమ్రోహా జిల్లాకు చెందిన మహిళతో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 28న వారి పెండ్లి జరుగాల్సి ఉండగా అఖిల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణం ఏమిటి అన్నది దర్యాప్తు చేస్తున్నారు.