కుభీర్, ఏప్రిల్ 11 : కొవిడ్-19 వ్యాక్సిన్ వేస్టేజ్ను తగ్గించాలని, ఒక వాయిల్లో 10 మందికి తప్పకుండా టీకా ఇచ్చేలా చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని నిర్మల్ డీఎంహెచ్వో ధన్రాజ్ ఆదేశించారు. కుభీర్ పీహెచ్సీని ఆదివారం డిప్యూటీ డీఎంహెచ్వో ఆశిశ్రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. రోజువారీ వ్యాక్సినేషన్ జాబితాను పరిశీలించి, వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పడిప్పుడే ప్రజలు అపోహలు వీడి స్వచ్ఛందంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా విస్తృత ప్రచారం కల్పించి, 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా అందించేందుకు కృషి చేయాలని వైద్యుడు రాథోడ్ అవినాశ్కు సూచించారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నదని, వ్యాక్సిన్ తీసుకున్న వారితో పాటు అందరూ నిబంధనలు పాటించేలా గ్రామాల్లో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలలని పేర్కొన్నారు. అనంతరం దవాఖాన పరిసరాలను పరిశీలించారు. ఆయన వెంట వైద్యుడు అవినాశ్, సూపర్ వైజర్లు వెంకటలక్ష్మి, గిరి సాయిబాబా, ఎల్టీ రాధిక, ఏఎన్ఎంలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భైంసా, ఏప్రిల్, 11 : కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో ధన్రాజ్ సూచించారు. ఆదివారం పట్టణంలోని ఆర్టీసీ డిపోలోని వ్యాక్సిన్ సెంటర్ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ, ముందస్తుగా టీకా తీసుకుంటే క్షేమంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని సూచించారు. ఆయన వెంట డాక్టర్ ఆశిష్ రెడ్డి, మతీన్, హెచ్ఈవో ఖలీముద్దీన్ ఉన్నారు.
జిల్లాలో 3871 కరోనా వ్యాక్సినేషన్
నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్11: జిల్లాలోని ఆయా మండలాలలో, ప్రధాన దవాఖానల్లో, ఎంపిక చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఆదివారం 3,871 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ తెలిపారు.