పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా ఊపిరితిత్తుల్లో కరోనా ఇన్ఫెక్షన్
వడోదర, ఏప్రిల్ 8: ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో వైరస్ జాడ సరిగ్గా తెలియట్లేదని, కచ్చితమైన నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు సూచిస్తున్నది. అయితే ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కూడా కొన్ని సందర్భాల్లో వైరస్ ఉనికి కచ్చితంగా తెలియడం లేదని గుజరాత్కు చెందిన వైద్యులు చెప్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారికి సీటీ స్కాన్ చేయగా వారి ఊపిరితిత్తుల్లో వైరస్ ఇన్ఫెక్షన్ను గుర్తించిన సందర్భాలు ఉన్నాయన్నారు. తాము కొవిడ్ నిర్ధారణలో ఆర్టీపీసీఆర్ పరీక్షను మాత్రమే కాకుండా సీటీ స్కానింగ్ను కూడా పరిగణలోకి తీసుకొంటున్నామని చెప్పారు. దీనిపై వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. కొన్ని కరోనా వైరస్ రకాలు ఆర్టీపీసీఆర్ పరీక్షలో కూడా చిక్కడం లేదని, ఊపిరితిత్తుల్లో వైరస్ జాడ ఉంటే కొవిడ్గానే పరిగణించి బీమా కల్పించాలని ఇన్సూరెన్స్ కంపెనీలను కోరింది.