మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి
ఇంటింటికీ వెళ్లి అవగాహన.. విస్తృతంగా ప్రచారం
పట్టించుకోని వారికి నోటీసులు
ముగిసిన ఆర్థిక సంవత్సరం.. రూ. 36.24 కోట్లు జమ
ఆదిలాబాద్ రూరల్/నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 2 :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 100 శాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేసింది. ప్రత్యేక బృందాలతో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించింది. ఆటోలు, ఫ్లెక్సీల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూనే మొండి బకాయిలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ రూ. 41.42 కోట్లు కాగా, రూ. 36.24 కోట్లు వసూలు చేసింది. అన్ని మున్సిపాలిటీలకు 90 శాతానికి పైగా ఆదాయం సమకూరింది.
ఉమ్మడి జి ల్లాలోని 12 మున్సిపాలిటీల్లో వంద శాతం పన్నుల వసూళ్లు లక్ష్యంగా యంత్రాం గం కృషి చేయగా, మార్చి 31 వరకు 87.49 శాతం పూర్తి చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా 12 మున్సిపాలిటీల్లో రూ. 41.42 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, రూ. 36.24 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ. 5.18 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. సకాలంలో పన్నులు చెల్లించాలంటూ పలు చోట్ల ఆటోలు, ఫ్లెక్సీల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రత్యేక బృందాలతో ఇంటింటికీ వెళ్లి లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా వసూళ్లకు కృషి చేశారు. పన్నులు చెల్లించలేని వారికి వాట్సాప్ ద్వారా అవకాశం కల్పించారు. పలు విధాలా ప్రచారం చేసినా, అవగాహన కల్పించినా స్పందించని యజమానులకు పన్నులు చెల్లించాలంటూ రెడ్ నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్, కొవిడ్ -19 నేపథ్యంలో పన్ను సగం మాఫీ కూడా చేసింది.
మంచిర్యాల జిల్లాలో 92.85 శాతం..
జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో వంద శాతం పన్నుల వ సూళ్లకు అధికారులు కసరత్తు చేశారు. ఇందులో భాగంగా మార్చి 31 వరకు రూ. 22.53 కోట్ల లక్ష్యానికిగాను 92.85 శాతం వసూలు చేశారు. మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే.. మంచిర్యాల మున్సిపాలిటీలో రూ. 12.33 కోట్లకుగాను రూ. 11.35 కోట్లు వసూలు చేసి, 92.01 శాతం పూర్తి చేశా రు. చెన్నూర్ మున్సిపాలిటీలో రూ. 80.65 లక్షలు టార్గెట్ కాగా, రూ. 77.21 లక్షలు వసూలు చేసి, 95.73 శాతం పూర్తి చేశారు. అధిక శాతంతో జిల్లాలో ముందు వరుసలో నిలిచారు. నస్పూర్ మున్సిపాలిటీలో రూ. 2.38 కోట్లు వ సూలు చేయాల్సి ఉండగా, రూ. 2.19 కోట్లు వసూలు చేశా రు. ఇంకా 18.79 లక్షలు వసూలు కావాల్సి ఉంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రూ.1.88 కోట్ల లక్ష్యానికిగాను, రూ. 1.76 కోట్లు వసూలు చేశారు. మందమర్రి మున్సిపాలిటీలో రూ. 1.63 కోట్లకుగాను రూ. 1.50 కోట్లు వసూలు చేసి, 92.06 శాతం పూర్తి చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ లో రూ. 1.99 కోట్లకు గాను రూ. 1.79 కోట్లు వసూలు చే సి, 90.05 శాతం పూర్తి చేశారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో రూ. 1.52 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, రూ. 1.43 కోట్లు వసూలు చేసి, 94.27 శాతం పూర్తి చేశారు.
కాగజ్నగర్ మున్సిపాలిటీలో 92.84 శాతం..
కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 92.84 శాతం పన్ను వసూలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపా రు. పట్టణంలోని 30 వార్డుల్లో 14088 గృహాలు, 57,583 జనాభా ఉంది. పన్నుల వసూలు లక్ష్యం రూ. కోటీ 55 లక్షల 77 వేలు కాగా, రూ. కోటీ 44 లక్షల పన్ను వసూలు చేసి, 92.84 శాతం పూర్తి చేశారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 68.52 శాతం
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.9 కోట్ల 61 లక్షలు లక్ష్యం కాగా, ఈ ఏడాది రూ. 6 కోట్ల 58 లక్షలు వసూలు చేశారు. మార్చి మొదటి వారం నుంచే ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు బృందాలను ఏర్పాటు చేసి పన్నుల వసూళ్లను పెంచారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కంటే తక్కువ ఉంటే నిర్ణీత గడువులోగా చెల్లిస్తే సగం మాఫీ చేయడంతో ప్రజలు కూడా అందుకు తగ్గట్లుగా స్పందించారని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తెలిపారు.
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో..
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 90 శాతానికి పైగా పన్నులు వసూలు చేశారు. నిర్మల్ మున్సిపాలిటీలో రూ. 5 కోట్ల 80 లక్షల 36 వేలు లక్ష్యం కాగా, రూ. 5 కోట్ల 70 లక్షల 68 వేలు వసూలు చేసి, 98.33 శాతం పూర్తి చేశారు. ఇక ఖానాపూర్ మున్సిపాలిటీలో రూ. 28 లక్షల 69 వేలు లక్ష్యం కాగా, రూ. 28 లక్షలు వసూలు చేసి, 97 శాతం పూర్తి చేశారు. భైంసా మున్సిపాలిటీ పరిధిలో రూ. కోటీ 65 లక్షలు లక్ష్యంగా పెట్టుకోగా, రూ. కోటీ 45 లక్షలు వసూలు చేసి, 91 శాతం పూర్తి చేశారు.
బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి..
ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న మొండి బకాయిదారుల నుంచి పన్నుల వసూళ్లకు అధికారులు తీవ్రంగా కృషి చేశారు. వందశాతం వసూళ్లలో భాగంగా పన్నులు ఎగవేతదారులు, ఏళ్ల తరబడి చెల్లించకుండా ఉన్నవారి జాబితాను సిద్ధం చేసి ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు. ఫ్లెక్సీలు, ఆటోల్లోనూ తిరుగుతూ పదేపదే సూచించారు. సకాలంలో చెల్లిస్తే సగం మా ఫీ అవుతుందన్న విషయాన్ని గుర్తుచేశారు. అయినా మొండికేసిన వారిపై తదుపరి చర్యలుంటాయని హెచ్చరికలూ జారీ చేశారు. సుదీర్ఘకాలంగా పన్నులు చెల్లించని షాపులు, యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. మొత్తానికి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా శతవిధాలా ప్రయత్నాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
సాగర్ ఉపఎన్నికలో నా ఓటు నోముల భగత్కే : రాం గోపాల్ వర్మ
రైలు ప్రమాదం.. 48కి చేరిన మృతుల సంఖ్య
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : చంద్రబాబు
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్: కొత్త ఐటీఆర్ ఫారాల్లో మార్పుల్లేవ్