కొవిడ్ కేసుల పెరుగుదలతో వైద్య శాఖ అప్రమత్తం
జిల్లాలో టెస్ట్ల సంఖ్య పెంచిన అధికారులు
అదే తరహాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ
నిర్మల్ అర్బన్, మార్చి 26: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకునేలా పీహెచ్సీలో కిట్లను అందుబాటులో ఉంచారు. ప్రసుత్తం జిల్లాలో సగటున రోజుకు 10 నుంచి 15 వరకు కేసులు నమోదవుతున్నాయి. గతేడాది కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో నిత్యం 1000 నుంచి 1500 టెస్టులు చేయగా, తర్వాత తగ్గించారు. మళ్లీ పొరుగు రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగడంతో, ప్రస్తుతం 900 నుంచి 1000 వరకు టెస్టులు చేస్తున్నారు. దీంతో ఆదిలోనే వైరస్ను గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందించే వీలు కలుగుతున్నది.
జిల్ల్లాలో లక్షకు పైగా టెస్టులు..
నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 1,56,350 టెస్టులను నిర్వహించగా, అందులో 5913 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొవిడ్ వైరస్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 57 యాక్టివ్ కేసులు ఉండగా, గురువారం 29 కేసులు నమోదు కావడంతో మొత్తం 86కు చేరింది. కరోనా కేసుల తగ్గుదలకు తీసుకుంటున్న చర్యలతో పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియకు కూడా వైద్యారోగ్య శాఖ అధికారులు అంతకుమించి రెట్టింపు చర్యలు తీసుకున్నారు. దీంతో జిల్లాలో 11వేల మంది వ్యాక్సినేషన్కు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 8వేల మందికి ఫస్ట్ డోస్ టీకా వేశారు. రెండో డోస్ దాదాపు 4500 మందికి పైగా వేశారు. నిత్యం జిల్లాలో 250 మందికి పైగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.
ఇక అన్ని పీహెచ్సీల్లోనూ టీకాలు
వ్యాక్సినేషన్ ప్రారంభంలో జిల్లా దవాఖానతో పాటు ఓ ప్రైవేట్ దవాఖానలో మాత్రమే టీకాలను అందుబాటులో ఉంచారు. అనంతరం పలు పీహెచ్సీల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్, రాంనగర్, సారంగాపూర్, నర్సాపూర్, కడెం, ఖానాపూర్, కుభీర్ పీహెచ్సీల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. రానున్న రోజుల్లో అన్ని పీహెచ్సీల్లో టీకాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వ్యాక్సిన్పై ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు 60 ఏళ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ అందించగా, తాజాగా 45 ఏళ్ల పైబడిన వారికి టీకా ఇస్తున్నారు.
మహారాష్ట్రకు ఆర్టీసీ సేవలు బంద్
నిర్మల్ జిల్లా నుంచి మహారాష్ట్రకు ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. నిర్మల్, భైంసా ప్రాంతం నుంచి నిత్యం పదుల సంఖ్యలో బస్సులు మహారాష్ట్రకు నడుస్తుండగా, కేసుల పెరుగుదలతో అధికారులు అప్రమత్తమై సర్వీసులను రద్దు చేశారు. అంతేకాకుండా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించే సంతలను స్వచ్ఛందంగా రద్దు చేసుకున్నారు.