మహబూబ్నగర్, మార్చి 23: లక్ష్యం పెట్టుకుని పనులు చేస్తే నిర్ధేశించుకున్న సమయంలోపు పూర్తయ్యే అవకాశం ఉంటుందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో జిల్లా ఇంజినీరింగ్, రెవెన్యూ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అధికారులతో మంగళవారం వీసీలో మాట్లాడారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూసేకరణ పనులు తుది దశకు తీసుకురావాలని ఆదేశించారు. అవార్డు పాస్ చేసే ముందు సర్వే నెంబర్లు భూసేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, జాతీయ రహదారుల కింద భూసేకరణ భారత్మాల రహదారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరారు. జాతీయ రహదారుల కింద భూములు కోల్పోతున్న రైతులు ఇబ్బంది పడకుండా న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉందండాపూర్ రిజర్వాయర్ సామాజిక ఆర్థిక సర్వే గణన పూర్తయినందున 3ఎన్ ప్రచురించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత, నేషనల్ హైవే పద్మశ్రీ అథారిటీ కన్సల్టెంట్ సత్యనారాయణ, సర్వేల్యాండ్ రికార్డు జిల్లా అధికారి శ్యాంసుందర్రెడ్డి తదితరులు ఉన్నారు.
లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడండి
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఆర్థిక సహాయానికి దరఖాస్తులు చేసుకున్న లబ్ధ్దిదారులతో ఒక్కసారైనా ప్రత్యక్షంగా మాట్లాడాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీసీలో తాసిల్దార్లతో మాట్లాడారు. ప్రతి శనివారం వారంలో వచ్చిన దరఖాస్తులను ప్రత్యక్షంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల జిల్లాకు రూ.కోటి 53లక్షలు మంజూరయ్యాయన్నారు. 7219 దరఖాస్తులు వచ్చాయని, తాసిల్దార్ల పరిశీలనలో 634 దరఖాస్తులు ఉండగా మరికొన్ని శాసన సభ్యుల అనుమతి కోసం పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వీటంటినీ పరిశీలించి సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
బాధ్యతగా పనిచేయండి
వైద్యపరమైన కారుణ్య నియామకాలు నిబంధనల ప్రకారం ఉంటే జాప్యం లేకుండా ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని 16 మందికి వైద్యపరమైన కారుణ్య నియామకాలకు సంబంధించిన కేసులను పరిశీలించారు. విధులు నిర్వహించేందుకు ఆరోగ్యం సహకరించని ఉద్యోగులతో ప్రత్యక్షంగా పరిశీలించి మాట్లాడారు. వారి ఉద్యోగాలను వారుసులకు ఇచ్చే విషయం కావాల్సిన వైద్య ధ్రువపత్రాలు, ఇతర పత్రాలను అనింటినీ క్షుణ్ణంగా పరిశీలించి జిల్లాస్థాయి కమిటీ ఆమోదం పొందిన తర్వాత నియామకపు చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధింత అధికారులను ఆదేశించారు.
బందోబస్తు పక్కాగా ఉండాలి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపర్చిన గోదాం వద్ద ఎప్పటిలాగే బందోబస్తు పక్కాగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు మాట్లాడారు. మంగళవారం కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం గోదాంలను తనిఖీ చేశారు. గోదాంలో ఉన్న వీవీ ప్యాట్లను పరిశీలించారు. ప్రతినెల సాధారణ తనిఖీలో భాగంగా ఈవీఎంలను కలెక్టర్ తనిఖీలు చేశారు.