కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్ధను విచ్ఛిన్నం చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. నోట్ల రద్దు నుంచి బ్యాంకుల అమ్మకం వరకూ దేశాన్ని నాశనం చేస్తున్నారని వారు హల్దియా పోర్టునూ త్వరలో అమ్మకానికి పెడతారని దీదీ ఆరోపించారు. బీజేపీ ఫ్యూడల్ భూస్వాముల పార్టీ అని కాషాయ నేతలు లక్షల కోట్ల రూపాయల నిధులను దండుకున్నారని దుయ్యబట్టారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కోనేందుకు పీఎం కేర్స్ ఫండ్స్ ద్వారా వసూలైన మొత్తంపై బీజేపీ వాస్తవాలతో ముందుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు తృణమూల్ పార్టీని వీడి కాషాయ తీర్ధం పుచ్చుకున్న అధికారి కుటుంబం తీరును దీదీ ఎండగట్టారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిడ్నపూర్ జిల్లాలోని పుర్బాలో శుక్రవారం జరిగిన తృణమూల్ ప్రచార ర్యాలీలో దీదీ మాట్లాడారు.
అధికారి కుటుంబాన్ని ఆమె మిర్ జాఫర్తో పోల్చిన మమతా బెనర్జీ వారు తృణమూల్ పార్టీని వీడటంతో తాము ఊపిరిపీల్చుకున్నామని చెప్పారు. బెంగాల్ నవాబు సిరాజుద్దులా వద్ద బెంగాలీ సైనికాధ్యక్షుడిగా పనిచేసిన మిర్ జాఫర్ ప్లాసీ యుద్ధం సమయంలో నవాబుకు వెన్నుపోటు పొడిచారు. నవాబుకు ద్రోహం చేసిన మిర్ జాఫర్ బ్రిటిషర్ల విజయానికి సహకరించాడు. మిర్ జాఫర్లు (వెన్నుపోటుదారులు) తృణమూల్ను వీడటంతో తమకు ఊరట కలిగిందని వ్యాఖ్యానించారు.