అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ చెలరేగారు. ఆరంభంలో సూర్య కుమార్ యాదవ్(57: 31 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), ఆఖర్లో శ్రేయస్ అయ్యర్(37: 18 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) దుమ్మురేపారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. యువ కెరటం రిషబ్ పంత్(30) కీలక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ(12), కేఎల్ రాహుల్(14), విరాట్ కోహ్లీ(1) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(4/33) భారత్ను బాగా ఇబ్బంది పెట్టాడు.
భారత ఇన్నింగ్స్లో సూర్య బ్యాటింగే హైలెట్గా నిలిచింది. తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో బ్యాట్తో అదరగొట్టాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్ బాదేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా తన స్టైల్లో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లోనే 6ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 50 మార్క్ అందుకున్నాడు. ఈ దశలో క్రీజులో ఉన్న పంత్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్న పంత్ ఆచితూచి ఆడాడు. ఇన్నింగ్స్ చివర్లో అయ్యర్ అద్భుత బ్యాటింగ్తో భారత్కు భారీ స్కోరు అందించాడు. అదిల్ రషీద్, మార్క్ వుడ్, బెన్స్టోక్స్, శామ్ కరన్ తలో వికెట్ పడగొట్టారు.