నేను షూటింగ్కి వస్తున్నాను రెడీగా ఉండండి అంటూ కొన్ని రోజుల కింద దర్శక నిర్మాతలకు తీపికబురు చెప్పాడు రజినీకాంత్. కానీ బయట పరిస్థితులు మాత్రం ఆయన చెప్పినంత ఈజీగా లేవు. పైగా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు రజినీకాంత్. అందుకే సినిమాలకు కూడా దూరంగానే ఉన్నాడు. ఈ కారణంతోనే ఈయన రాజకీయాలకు కూడా శాశ్వతంగా దూరమైపోయాడు. తను పాలిటిక్స్ చేయలేనని చెప్పేశాడు. అనారోగ్యం కారణంగా మానసిక ఒత్తిడికి లోను కాలేనని చెప్పాడు సూపర్ స్టార్. ఇదిలా ఉంటే దీనికంటే ముందే గతేడాది ఈయన శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమాకు కమిటయ్యాడు. ఆ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఆ మధ్య హైదరాబాద్లోనే షూటింగ్ జరిగింది. అప్పుడే ఉన్నట్లుండి అనారోగ్యం పాలు కావడంతో చెన్నై వెళ్లిన రజినీ అక్కడే రెస్ట్ తీసుకున్నాడు.
కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్న ఈయన ఈ మధ్య మళ్ళీ షూటింగ్కు రావడానికి సిద్ధమయ్యాడు. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో 2021 సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమా కాస్తా ఇప్పుడు నవంబర్ 4కు వెళ్లిపోయింది. దీపావళి కానుకగా అన్నాత్తే విడుదల కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం వస్తుంది. వేదాళం, విశ్వాసం లాంటి వరస విజయాలతో దూసుకుపోతున్న శివ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో రజినీ అభిమానులు కూడా నమ్మకంగానే ఉన్నారు. అన్నాత్తే కచ్చితంగా రజినీ కోరికను నెరవేరుస్తుందని.. హిట్ లోటు భర్తీ చేస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్.
ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుపెట్టాలని ఆలోచిస్తున్న దర్శకుడు శివకు పెరుగుతున్న కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి. దేశంలో రోజురోజుకు వైరస్ బాధితులు పెరిగిపోతున్నారు. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వాళ్లు బయటికి రాకుండా ఉండడమే మంచిది అని ప్రభుత్వమే చెబుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రజినీకాంత్ బయటికి రావడం అంత శ్రేయస్కరం కాదు అంటున్నారు వైద్యులు. అందుకే అన్నాతే అంటే షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. ఈ సినిమాలో రజినీ ఇంట్రో సాంగ్ దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. డి ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో రజినీకాంత్ కు చాలా ఇంట్రో సాంగ్స్ పాడారు బాలు. అలాగే అన్నాత్తే కూడా గతేడాది లాక్ డౌన్ కు ముందుగానే రికార్డ్ చేశాడు ఇమాన్. ఈ పాటను కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు.