న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ అండ్ టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా నిరంతరం నవ్యతకు ప్రాధాన్యం ఇస్తుంటారు. స్టార్టప్ కంపెనీలు, టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంటారు. తాజాగా ప్రీతిష్ నందీ కమ్యూనికేషన్స్లో గత వారం రతన్ టాటా వాటాలు కొనుగోలు చేశారు. ఈ సంగతిని ప్రీతిష్ నందీస్ కమ్యూనికేషన్స్ సోమవారం తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. అయితే, ప్రీతిష్ నంది కమ్యూనికేషన్స్లో ఎంత వాటాను రతన్ టాటా కొనుగోలు చేశారన్న సంగతిని వెల్లడించలేదు. ఆయన తన వ్యక్తిగత హోదాలో ప్రీతిష్ నందీ కమ్యూనికేషన్స్లో వాటాలు కొనుగోలు చేశారు. ఈ సంగతి బయటపడటంతో ప్రీతిష్ నంది కమ్యూనికేషన్స్ షేర్ 9.81 శాతం ఎక్కువగా ట్రేడ్ అయ్యింది.
1993లో ప్రితీశ్ నందీ కమ్యూనికేషన్స్ కొలువుదీరింది. టీవీ కంటెంట్ అందించే సంస్థగా ఏర్పాటైన ఈ కంపెనీ అనేక వార్త, వినోద కార్యక్రమాల్ని నిర్వహించింది. 2000లో ఐపీవోకి వచ్చింది. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓ కార్పొరేట్ సంస్థ పబ్లిక్ ఇష్యూకి రావడం అదే తొలిసారి. గత 18 ఏండ్లలో సంస్థ స్థిరమైన ఆర్థిక వృద్ధిరేటును సాధించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.2,653గా ఉన్నట్లు ప్రితీశ్ నంది కమ్యూనికేషన్స్ తన వెబ్సైట్లో పేర్కొంది. రతన్ టాటా ఇంతకుముందు పెట్టుబడులు పెట్టిన ఫార్మా స్టార్టప్ జెనెరిక్ ఆధార్ తాజాగా ఫార్మసీ అగ్రిగేటర్ యాప్ను ఆవిష్కరించింది.