హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నాయి. తమ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్సార్) నిధులను పాఠశాలల అభివృద్ధికి భారీగా ఖర్చు చేస్తున్నాయి. 2018 నుంచి ఇప్పటివరకు రూ.150 కోట్లకు పైగా నిధులను ఇందుకోసం వెచ్చించాయి. పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, కంప్యూటర్ ల్యాబులు, డ్యూయల్ డెస్క్ బల్లలు తదితర మౌలిక వసతులను సీఎస్సార్ నిధులతో కల్పిస్తున్నాయి. ఇలా రెండేండ్లలో 280కి పైగా స్కూళ్లల్లో వసతుల కొరతను తీర్చారు.
రాష్ట్రంలో 26,062 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 19.83 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక చర్యలతో ఇటీవలి కాలంలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు అద్భుతంగా పెరిగాయి. దాంతో చాలామంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. దాంతో వారందరికి సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు, బల్లలు వంటి సదుపాయాలు కల్పించటం కష్టంగా మారింది. సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చుచేస్తున్నా కొన్నిచోట్ల సమస్యలు ఉంటున్నాయి. దాంతో ప్రభుత్వ సూళ్ల అభివృద్ధిలో ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలను కూడా భాగస్వాములను చేయాలని విద్యాశాఖ సంకల్పించింది. ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటుచేసిన కార్పొరేట్ సంస్థల నుంచి నిధుల సమీకరణ చేపట్టింది. పరిశ్రమలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు లేఖలు రాయగా, చాలా సంస్థలు ముందుకు వచ్చి పాఠశాలల అభివృద్ధికి సీఎస్సార్ నిధులను ఖర్చుచేస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ఐటీ కంపెనీలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థి కమిటీలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నారు.