కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శల దాడి తీవ్రతరం చేశారు. ఏదో ఒక రోజు దేశానికి మోదీ పేరు పెట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్పై ప్రధాని ఫోటో ముద్రించడాన్ని దీదీ తప్పుపట్టారు. ‘ ఓ స్టేడియానికి ప్రధాని పేరు పెట్టారు..కొవిడ్ సర్టిఫికెట్లపై ఆయన ఫోటోలు ముద్రించారు..దేశానికి ఆయన పేరు పెట్టేరోజు ఎంతో దూరంలో లేద’ని మమతా బెనర్జీ అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సోమవారం కోల్కతాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. బెంగాల్లో తృణమూల్ సర్కార్కు వ్యతిరేకంగా ప్రధాని మోదీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో ప్రజలు దీదీ వర్సెస్ బీజేపీ పోరుగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలోనే కాషాయ నేతలు బెంగాల్కు వచ్చి అసత్యాలు ప్రచారం చేస్తారని, మహిళల భద్రతపై ప్రధాని మనకు లెక్చర్లు ఇస్తున్నారని బీజేపీ పాలిత రాష్ట్రాలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.