కూరలు వండుతున్నప్పుడు ఒక్కోసారి ఉప్పు, కారం ఎక్కువ అవుతుంటాయి. టైం అయిపోతుందనే కంగారులోనో.. ఏదో పరధ్యానంలోనో ఒక్కోసారి ఉప్పు, కారం ఎక్కువ వేస్తుంటాం. కూరలో ఉప్పు తక్కువ అయితే వేసుకోగలం. అదే ఎక్కువైతే కూర టేస్ట్ మొత్తం పోతుంది. ఇక ఆ కర్రీని తినలేం. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కూరలో ఎక్కువైన కారం, ఉప్పును తగ్గించేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఒక ఆలుగడ్డను నాలుగు ముక్కలుగా చేసి వాటిని కూరలో వేయాలి. అలా పది నుంచి 15 నిమిషాల పాటు వాటిని అందులో ఉడకనివ్వాలి. ఆలుగడ్డ ముక్కలు ఉప్పుతో పాటు నీటిని కూడా పీల్చుకుంటుంది. కాబట్టి గ్రేవీ కర్రీ అయితే కూరలో కొన్ని నీళ్లు కూడా పోసుకోవడం మంచిది. తినే ముందు కూరలో నుంచి ఆలుగడ్డ ముక్కలను తీసేయొచ్చు.
కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు కొద్దిగా కొబ్బరి పాలు కలపాలి. ఇలా చేయడం ద్వారా కూరలో ఉప్పదనం తగ్గి రుచిగా తయారవుతుంది.
కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు కొద్దిగా పాలు, పెరుగు లేదా మీగడ కలపాలి. అప్పుడు ఉప్పదనం తగ్గడమే కాకుండా కర్రీకి కొత్త రుచి వస్తుంది.
ఉల్లిగడ్డ ముక్కలను నూనెలో వేయించి కూరలో కలుపుకున్నా ఉప్పు తగ్గుతుంది. కూరలో కొన్ని టమాటా ముక్కలను కూడా వేయొచ్చు.
అలాగే కొద్దిగా నిమ్మరసం కలిపినా ఎక్కువైన ఉప్పును సరిచేస్తుంది.
ఒకవేళ కూరలో తక్కువ నీళ్లు ఉంటే.. మరికొన్ని నీళ్లను వేసి కూరను బాగా ఉడికించాలి.
గోధుమ పిండికి కొంచెం నీళ్లను కలిపి ఉండలుగా చేసుకోవాలి. వాటిని కూరలో వేయడం ద్వారా కూరలో ఎక్కువైన ఉప్పును పిండి గ్రహించేస్తుంది. ఆ తర్వాత వాటిని తీసేయొచ్చు.
కూరలో కొంచెం చక్కెర కలిపినా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది.
కూరలో కారం ఎక్కువైతే కొన్ని టమాటా ముక్కలను వేసి తక్కువ మంట మీద ఉడికించాలి
కొంచెం చక్కెర లేదా వెనిగర్ కలిపినా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అలా అని ఎక్కువ చక్కెర కలిపితే కూర తియ్యగా మారే అవకాశం ఉంది కాబట్టి చూసుకుని కలపాలి.
చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ కూరలు అయితే నిమ్మరసం పిండొచ్చు.
కూరలో కొన్ని నీటిని యాడ్ చేయడం ద్వారా కూడా కారం తగ్గించొచ్చు.
కూరలో కొబ్బరి పాలు కలడం ద్వారా కూడా ఎక్కువైన కారాన్ని తగ్గించవచ్చు.