బీజింగ్: దేశంలో ఉన్న కఠిక పేదరికంపై సంపూర్ణ విజయం సాధించినట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో.. పేదరికాన్ని సమూలంగా నిర్మూలించినట్లు ఆయన వెల్లడించారు. బీజింగ్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనలో విజయం సాధించామన్నారు. పేదరిక నిర్మూలన కోసం పోరాడిన వారిని ఆయన సన్మానించారు. గడిచిన 8 ఏళ్లలో.. దారిద్య్రరేఖకు దిగువ ఉన్న సుమారు పది కోట్ల కుటుంబాలను పేదరికం నుంచి ఆదుకున్నామన్నారు. దారిద్య్రరేఖ జాబితా నుంచి 832 కౌంటీలను, 128000 గ్రామాలను తొలగించినట్లు జీ జిన్పింగ్ తెలిపారు. పేదరిక నిర్మూలన కోసం 1970 చైనా ప్రభుత్వం పలు పథకాలను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దారిద్య్ర నిర్మూలనలో ప్రపంచ దేశాలకు 70 శాతం సహకరించినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘనతలతో చైనా అద్భుతం సాధించిందని జీ జిన్పింగ్ అన్నారు. ఇది మానవ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు. అన్ని రకాల స్థానిక తెగలు, జాతుల సహకరాంతో ఈ అద్భుత సాధ్యమైందన్నారు.