మున్సిపాలిటీలలో అత్యవసర సేవల కోసం 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
రంగారెడ్డిజిల్లా మీర్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల్లో పర్యటన
షాబాద్, జూలై 15 : భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీలో ఆమె పర్యటించి స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాల వల్ల తలెత్తె సమస్యలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అత్యవసర సేవల కోసం 24గంటలూ అందుబాటులో ఉండేలా ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులపై అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించాలన్నారు. చెరువులు, నాలాల వద్ద వరదనీరు సాఫీగా పోయేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో తలెత్తే సమస్యలను గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో జలమయమైన ప్రాంతాలను గురువారం మంత్రి సందర్శించారు. రంగారెడ్డిజిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. పలు కాలనీల్లో ఇండ్లలో నీరు చేరడంతో వారికి అండగా ఉంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి సూచించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో అత్యవసర సేవల కోసం 24గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెరువులు, నాలాల వద్ద వరదనీరు సాఫీగా పోయేలా చెత్తాచెదారం తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. నిలిచిన నీటిని తొలగించడంతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు.
మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్నగర్, మిథులానగర్, సత్యసాయి కాలనీ, రెడ్డి బ్యాటరీస్, ఎస్ఎల్ఎన్ఆర్ కాలనీ, శ్రీధర్ కాలనీ తదితర ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. జల్పల్లి మున్సిపాలిటీలోని ఉస్మాన్నగర్లో పర్యటించిన మంత్రి బురాన్ఖాన్ చెరువుకు సంబంధించి వెంకటాపూర్ తూము వద్ద రాళ్లు, చెత్తను తొలగించాలని కమిషనర్ను ఆదేశించారు. ప్రజలు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని, శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండవద్దని.. అధికారుల సూచనలు పాటించాలని చెప్పారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో 24గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ నంబర్ను సంప్రదించాలని కోరారు. అవసరం ఉంటే సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.