కొడంగల్కు నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్
మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ప్రజాప్రతినిధులు
మోమిన్పేట, సెప్టెంబర్ 13: అసంభవమనుకున్న తెలంగాణను సాధించి, బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ కారణ జన్ముడని మోమిన్పేట నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ నర్సింలు గుప్తా అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన, దేశంలో ఎక్కడా లేనివిధంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై ‘తెలంగాణ భగీరథుడు’ అనే కవితా సంపుటి రాసి కేసీఆర్కు అంకితమిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాసిన తెలంగాణ భగీరథుడు అనే పుస్తకాన్ని సోమవారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, నరేందర్రెడ్డి, గణేశ్, రాష్ట్ర సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు విఠల్, ముఖ్యమంత్రి ఓఎస్డీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ సమక్షంలో ఆవిష్కరించారు.
కొడంగల్ అభివృద్ధికి మరిన్ని నిధులు
కొడంగల్, సెప్టెంబర్ 13: కొడంగల్ అభివృద్ధికి మరింత సహకారాన్ని అందించాలని కోరుతూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి కోరారు. సోమవారం హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ను కలిసిన కొడంగల్ నేతలు అభివృద్ధిపై చర్చించారు. నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న తరువాత అధిక మొత్తంలో నిధులు మంజూరు చేశారని, ప్రస్తుతం పనులు జోరుగా కొనసాగుతున్నాయని వారు తెలిపారు. కొడంగల్ మున్సిపల్ భవనం అందుబాటులో లేదని, అతిథి గృహం శిథిలావస్థలకు చేరుకున్నదని భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి పార్టీ పటిష్టత కు ఎంతగానో తోడ్పడుతున్నారని, ఆయనకు ప్రాధాన్యతను కల్పించే దిశగా పదవిని ఇవ్వాలని కోరారు. స్పందించిన మంత్రి మున్సిపల్ కార్యాలయ భవనానికి రూ.కోటి, ఆర్అండ్బీ అతిథి గృహానికి రూ.50 లక్షలు మంజూరు చేశారు. మాజీ ఎమ్మెల్యేకు గౌరవ ప్రదమైన పదవిని అందించేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, మాజీ జడ్పీటీసీ మోహన్రెడ్డి, సలీం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ అభ్యున్నతికి పని చేయాలి
తాండూరు, సెప్టెంబర్ 13: నియోజకవర్గంలో అందరు కలిసి మెలిసి పార్టీ కోసం పని చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కమిటీలను ఎలాంటి మనస్పర్దలు లేకుండా ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీనియర్, జూనియర్ అనకుండా పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు కీలకమని, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్థానిక నేతలను కలుపుకొని పనిచేయాలని సూచించారు. తాండూరు అభివృద్ధిపై ఎమ్మెల్యేను అడిగి తెలుసుకున్నారు.