తాండూరు రూరల్, జూలై 25 : తాండూరు మండలం మల్కాపూర్లో ఆదివారం డప్పు వాయిద్యాల మధ్య బోనాలను ఊరేగించి మైసమ్మ దేవతకు సమర్పించారు. మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి ఉన్నారు.
గోగ్యానాయక్తండాలో బంగారు మైసమ్మ బోనాలు
చౌడాపూర్ మండలం గోగ్యానాయక్తండాలో బంగారు మైసమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామం నుంచి దేవాలయం వరకు పోతురాజుల విన్యాసాల మధ్య మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రవినాయక్ పాల్గొన్నారు.
పరిగిలో..
పరిగి పట్టణంలో తెలంగాణతల్లి విగ్రహం నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమై అమ్మవారి ఆలయం వరకు కొనసాగింది. చిన్నారులు సైతం బోనాలు ఎత్తుకున్నారు. ఊరేగింపులో వల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఊరేగింపు అనంతరం మైసమ్మ ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి పరిగి అధ్యక్ష, కార్యదర్శులు భీమయ్య, నాగేశ్వర్ పాల్గొన్నారు.
మర్పల్లిలో..
మండల కేంద్రంలో మహిళలు బోనాలను అందంగా అలంకరించి పురవీధులగుండా డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా తరలివెళ్లి ఆలయంలో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
150 బోనాలతో..
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు వెంకటపూర్తండాలో ఇంటికో బోనం చొప్పున 150 బోనాలతో డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు సమర్పించారు.