మంచాల జూలై 18 : అల్పపీడన ప్రభావంతో మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కుంటలను తలపించేలా రోడ్లు మారాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువు, కుంటల్లోకి నీళ్లు వచ్చాయి. అదేవిధంగా మండలంలోని బండలేమూరు గ్రామానికి చెందిన వట్టి సోమయ్య, వట్టి పెద్ద యాదయ్యకు చెందిన ఇండ్లు కూలిపోయాయి. సర్పంచ్ మంగ బాధితులను పరామర్శించారు.
యాచారం మండలంలో..
మండలంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వాన పడుతున్నది. దీంతో మండలంలోని చెరువు, కుంటల్లోకి నీళ్లు వస్తున్నాయి. కుర్మిద్ద గ్రామంలోని పెద్ద చెరువు అలుగుపోస్తున్నది. ధర్మపురి చెరువు నిండే దశకు వచ్చింది. నందివనపర్తి చెరువు సైతం మత్తడి పోస్తున్నది. తాడిపర్తి చెరువులోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. యాచారం అబ్బసావు చెరువు నిండింది. మేడిపల్లిలో తూంబావి కుంట నిండిపోయింది. మంథన్గౌరెల్లి వాగు నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. మాల్ మార్కెట్ లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీళ్లు వచ్చి చేరాయి. వర్షం కురుస్తుండటంతో గ్రామాల్లో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో ముసురు
అల్పపీడన ప్రభావంతో ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో వాన కురుస్తున్నది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న ముసురుకు మండలంలోని పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డతండా, శంకర్కొండతండాలకు వెళ్లే రహదారుల గుండా వాగులు పొంగిపొర్లాయి. కడ్తాల్ మండలంలోని గోవిందాయిపల్లి చెరువు, నాగిరెడ్డి, తుమ్మలచెరువు, చరికొండ గ్రామంలోని గౌరవమ్మ చెరువు, శెట్టిపల్లి, విఠాయిపల్లిల్లో పల్లెచెరువుల్లోకి వాగు సాగు చెరువులోకి వరద వచ్చిచేరుతున్నది. మాడ్గుల మండలంలో అప్పారెడ్డిపల్లి, నాగిళ్ల, గిరికొత్తపల్లి, దొడ్లపహాడ్, ఇర్విన్, అందుగుల, నర్సంపల్లిలోని చెరువుల్లోకి నీళ్లు చేరుతున్నాయి. తలకొండపల్లి మండలంలోని చీపునుంతల, చుక్కాపూర్, ఎడవేళ్లి, వెల్జాల్ సహదేవమ్మచెరువు, మెదక్పల్లి, రాంపూర్, పడకల్ గ్రామాల్లోని చెరువులోకి వరద వచ్చిచేరుతున్నది. ముసురుతో మట్టి మిద్దెలు కూలే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చాటింపు వేయించారు.