కడ్తాల్, జూలై 23: విత్తన బంతులతో అటవీసంపద వృద్ధి చెందుతుందని, పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలను పెంచాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ సంస్థ వ్యవస్థాపకురాలు కోర్పోలు లీలాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో అటవీశాఖ, సీజీఆర్ సంయుక్త ఆధ్వర్యంలో విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లీలాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గత పదేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ ఆధ్వర్యంలో 34 లక్షల మొక్కలను నాటామని తెలిపారు. అంతేకాకుండా ఇప్పటివరకు 16 లక్షల విత్తన బంతులు తయారు చేసి చల్లామన్నారు. మొక్కలు పెంచడం, పర్యావరణాన్ని కాపాడటం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు.
2021-22 సంవత్సరానికి గానూ రెండు లక్షల విత్తన బంతులు చల్లాడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. పచ్చదనం పెంపుతోనే వర్షాలు సమృద్ధిగా కురవడంతోపాటు వాతావరణంలో సమతుల్యత ఏర్పడుతుందన్నారు. విత్తన బంతులను అటవీ ప్రాంతంతోపాటు ప్రభుత్వ భూములలో చల్లాలని సూచించారు. మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్లు శంకర్, రవీందర్రెడ్డి, ఆమనగల్లు, కందుకూరు మండలాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు కమాలుద్దీన్, నిఖిల్రెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు హేమ, దేవేందర్, ఎఫ్బీవో లలిత, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయభాస్కర్రెడ్డి, సీజీఆర్ ప్రతినిధులు డాక్టర్ సాయిభాస్కర్రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త ఉమామహేశ్వర్రెడ్డి, వెంకటేశ్, వర్ధన్రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.