ఇబ్రహీంపట్నంరూరల్/ పూడూరు, జూలై 19: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణంలో పలు మార్పులు వచ్చాయి. దీంతో దగ్గు, జలుబు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. కరోనా లక్షణాలను పోలిన వైరల్ ఫీవర్ లక్షణాలు ఉంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు
ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరసం, ఒంటిపై దుద్దర్లు, వికారం, తలనొప్పి, ఆకలి మందగించడం, గొంతునొప్పి, ముక్కుకారడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి నుంచి ఉపశమనం కలుగడానికి మాత్రమే మందులు ఉపకరిస్తాయి. వైరల్ ఫీవర్తో శరీరంపై భాగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. వివిధ రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వ్యాధులపై అప్రమత్తత అవసరం
వానకాలం ప్రారంభమైనందున ప్రజలు విష జ్వరాల బారినపడే అవకాశం ఉంది. కావున జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా లక్షణాలను పోలిన విధంగా వైరల్ ఫీవర్ ప్రబలుతుండడంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. ఏఎన్ఎమ్లు, ఆశావర్కర్లకు అవగాహన కల్పిస్తూ, వైరల్ ఫీవర్కు మందులు అందుబాటులో ఉంచుతున్నారు. వివి ధ శాఖల అధికారుల సమన్వయంతో ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈగలు, దోమల నివారణకు మందు పిచికారీ చేయిస్తున్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు సర్పంచ్లు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు రావు
వాతావరణం మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. రోగాల బారిన పడకుండా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగీ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ దవాఖానలోనే చేయించుకోవాలి. ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటిస్తే సీజనల్ రోగాలు సోకకుండా జాగ్రత్త పడొచ్చు. కరోనా సోకకుండా భౌతిక దూరం పాటించాలి. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ను తప్పనిసరిగా తీసుకోవాలి.
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. వైద్యుల సలహాల మేరకే మందులు వాడాలి. దోమ తెరలు వినియోగించాలి. పూల కుండీలు, ఎయిర్కూలర్ల నీటి గొట్టాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.