రంగారెడ్డి, జూలై 27, (నమస్తే తెలంగాణ) : రైతులకు సహకార బ్యాంకు లక్ష్యానికి మించి పంట రుణాలను మంజూరు చేస్తున్నది. ఓ వైపు బ్యాంకుల చుట్టూ రుణాల కోసం రైతులు ప్రదక్షిణలు చేస్తున్నా ప్రైవేట్ బ్యాంకులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుంటే, సహకార బ్యాంకులు మాత్రం అర్హులైన ప్రతీ రైతుకు పంట రుణాలను అందజేస్తూ సహకారమందిస్తున్నాయి. అధికారులు నాలుగేండ్లుగా నిర్దేశించిన లక్ష్యానికిపైగా రైతులకు రుణాలలందిస్తున్నారు. ప్రతీ ఏడాది దాదాపు 80 వేల మంది రైతులకు పంట రుణాలను సహకార బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంకే కాకుండా సంబంధిత బ్యాంకు పరిధిలోని 30 శాఖల్లోనూ ప్రతీ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి మించి రైతులకు రుణాలనందిస్తున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్కుగాను హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని 30 బ్రాంచీల్లో రూ.300 కోట్ల పంట రుణాలు ఇవ్యాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు రూ.280 కోట్ల రుణాలను రైతులకు మంజూరు చేశారు. ఈనెలాఖరులోగా లక్ష్యానికి మించి రుణాలు ఇవ్వనున్నారు.
నాలుగేండ్లుగా 115 శాతం నుంచి 150 శాతం మేర పంట రుణాలను ఇస్తున్నారు. 2017-18లో లక్ష్యం రూ.218 కోట్లకుగాను రూ.320 కోట్లు, 2018-19లో రూ.272 కోట్లకుగాను రూ.374 కోట్లు, 2019-20లో రూ.390 కోట్లకుగాను రూ.432 కోట్లు, 2020-21లో రూ.220 కోట్లకుగాను రూ.330 కోట్లమేర రుణాలను మంజూరు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.280 కోట్ల రుణాలను మంజూరు చేసిన సహకార బ్యాంకులు, సీజన్ పూర్తయ్యేలోగా రూ.350 కోట్ల రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీసీసీబీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఈ ఏడాది బంగారంపై రుణాలకు సంబంధించి రూ.170 కోట్లు, ఎల్టీ రుణాలకు సంబంధించి రూ.100 కోట్లు, గిడ్డంగుల నిర్మాణానికిగాను రూ.27 కోట్ల రుణాలను ఇప్పటివరకు డీసీసీబీ మంజూరు చేసింది.
ప్రైవేట్ బ్యాంకుల ద్వారా అరకొర రుణాలే..
ఈ ఆర్థిక సంవత్సరం కూడా ప్రైవేట్ బ్యాంకర్లు అరకొర రుణాలనే మంజూరు చేశారు. ఓ వైపు రైతులకు పంట రుణాలను మంజూరు చేయడంలో నిర్లక్ష్యంతో వానకాలం సీజన్లో ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యంలో 20 శాతం మేర రుణాలను ఇచ్చారు. ఈ ఏడాది వానకాలం, యాసంగి సీజన్లకుగాను రూ.2073 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ప్రైవేట్ బ్యాంకర్లు సుమారు రూ.300 కోట్ల రుణాలను మాత్రమే రైతులకు అందజేశారు. గతేడాది కూడా వానకాలం, యాసంగి సీజన్లలో బ్యాంకర్లు అంతంతమాత్రంగానే రుణాలిచ్చారు. రెన్యువల్స్ తప్ప కొత్త రుణాల్విడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వానకాలం, యాసంగి రెండు సీజన్లకు కలిపి కేవలం 46 శాతం రుణాలను మాత్రమే బ్యాంకర్లు మంజూరు చేశారు.
ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 2,18,412 మంది రైతులకుగాను వానకాలం, యాసంగి సీజన్లలో పంట రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గతేడాది వానకాలం, యాసంగిలలో రూ.1810 కోట్ల రుణాలను 95 వేల మంది రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా కేవలం రూ.785 కోట్ల రుణాలను మాత్రమే బ్యాంకర్లు మంజూరు చేశారు. వానకాలం సీజన్కుగాను రూ.1208 కోట్ల రుణాలను జిల్లా రైతాంగానికి మంజూరు చేయాలని నిర్ణయించగా.. రూ.494 కోట్లు రుణాలను, యాసంగి సీజన్లో రూ.602 కోట్ల రుణాలను రైతులకు అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. కేవలం రూ.291 కోట్ల రుణాలను మాత్రమే మంజూరు చేశారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ కీలకమైన పంట రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు వచ్చేలా చేస్తున్నారు.
అర్హులైన రైతులందరికీ రుణాలు : డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి
హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంకుతోపాటు అన్ని శాఖల్లోనూ అర్హులైన రైతులందరికీ సకాలంలో పంట రుణాలను అందజేస్తున్నాం. ప్రతి ఏటా అన్ని బ్రాంచీల్లో లక్ష్యానికి మించి రైతులకు రుణాలను అందిస్తున్నాం. అర్హులైన రైతులకు రుణాలు మంజూరు చేసి అండగా ఉంటాం.