వికారాబాద్, జూలై 22, (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా తడిపి ముద్దయింది. అన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షంతోపాటు ఈదురు గాలులు వీచాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మంగళవారం రాత్రి మొదలైన వర్షం గురువారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉంది. ముసురు వానతో పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. ఇప్పటికే పలు ప్రాజెక్టులు మత్తడి పోస్తున్నాయి. జిల్లాలోని కాగ్నా, కాకరవాణి, మూసీ – ఈసీ వాగులు, నందివాగు, సర్పన్పల్లి, శివసాగర్తో పాటు బంట్వారం మండలంలో ఉన్న సుల్తాన్పూర్ చెరువు భారీగా అలుగుపోస్తున్నాయి. ధారూరు మండలలోని దోర్నాల్- ధారూరు స్టేషన్ గ్రామాల మధ్య ఉన్న (కాగ్నా) వాగు తాత్కాలిక వంతెనపై నుంచి పొంగిపొర్లుతున్నాది. ఇక వానకాలం పంటలకు బెంగలేనట్లేనని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గణనీయంగా వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనున్నది. అధిక వర్షాలతో పత్తి, సోయాబీన్, మక్క పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు కుల్కచర్ల మండలంలో 33.5 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 మండలాల్లోని 17 మండలాల్లో అత్యధికంగా, చౌడాపూర్లో అత్యల్పంగా, పరిగిలో లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. పొలాలు నీట మునిగాయి. పాత ఇండ్లు కూలిపోయాయి. భారీ వర్షాలతో అనంతగిరిలో వాటర్ ఫాల్స్ నుంచి, ఘాట్ సమీపంలోని కొండపై నుంచి నీళ్లు కిందకు దూకుతున్నాయి. అనంత ‘గిరులు’ పర్యటకులను మంత్రాముగ్ధులను చేస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు కనువిందు చేస్తున్నాయి.
వర్షపాతం నమోదు ఇలా..
తాండూరు డివిజన్లోని తాండూరులో 18.9మి.మీ, యాలాల్ 16.4మి.మీ, పెద్దేముల్ 22.0 మి.మీ, బషీరాబాద్ 14.6మి.మీ, బొంరాస్పేట్ 10.6మి.మీ, కొడంగల్ 13.6మి.మీ, దౌల్తాబాద్ 20.4 మి.మీ, వికారాబాద్ డివిజన్లోని మర్పల్లిలో 24.4 మి.మీ, మోమిన్పేట్ 25.0 మి.మీ, నవాబ్పేట్ 20.0 మి.మీ, వికారాబాద్ 22.8 మి.మీ, పూడూర్ 28.2 మి.మీ, పరిగి 15.2 మి.మీ, కుల్కచర్ల 33.5 మి.మీ, దోమ 27.0 మి.మీ, ధారూరు 19.8 మి.మీ, బంట్వారం 22.9 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది.
నేడు, రేపు ఇదే పరిస్థితి
నేడు అల్పపీడనం కారణంగా భారీ,అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం మూడు రోజుల నుంచి వానలు దంచికొడుతున్నాయి.అన్ని మండలాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే సగం కుంటలు, చెరువులు,ప్రాజెక్టులు నిండిపోయాయి.వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అల్పపీడన ప్రభావం మరో మూడు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 248.3 జిల్లాలో ఇప్పటి వరకు మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 389.0 మి.మీ కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 మండలాల్లో 17 మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదు కాగా..అత్యల్పంగా చౌడాపూర్,డిపిషీట్లో పరిగి నమోదైంది.వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి.
నిండుకుండల్లా 190 చెరువులు
జిల్లా వ్యాప్తంగా 1196 చెరువులు ఉన్నాయని జిల్లా ఇరిగేషన్ ఈఈ సుందర్ తెలిపారు. ఇందులో 190 చెరువులు వంద శాతంనిండాయి. 152 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. 186 చెరువులు 50-75 శాతం, 238 చెరువులు 25- 50 శాతం, 430 చెరువులు 25 శాతం నిండినట్లు తెలిపారు.