షాబాద్, సెప్టెంబర్ 21 : రైతు బీమాపై ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని రంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం జడ్పీ వైస్ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. స్థాయి సంఘాల సమావేశం-5,(స్త్రీ, శిశు సంక్షేమం), సాంఘిక సంక్షేమం-6, స్థాయి సంఘం-3, వ్యవసాయంపై సమీక్షా సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ మాట్లాడుతూ.. జిల్లాకు రైతు బంధు పథకం కింద పెండింగ్లో ఉన్న 2, 3 విడుతల కింద రూ.350 కోట్లు విడుదల చేయాలని కమిటీ తీర్మానం చేసింది. నాబార్డు కింద ప్రతి మండలానికి ఒక గోడౌన్ నిర్మాణం పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలు కేంద్రానికి ఈ నెల 30 లోపు పంపాలని నిర్ణయించారు. ధాన్యం ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న సమయంలో అన్ని సెంటర్లకు స్టోరేజీకి అనుగుణంగా పంపాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాడి ఆవుల కోసం డీడీలు కట్టిన రైతులకు ఆవులను అందజేయాలని తలకొండపల్లి జడ్పీటీసీ కోరారు. పశువులు చనిపోతే లబ్ధిదారులకు బీమా ద్వారా పాడి పశువులను పంపిణీ చేయాలని పశుసంవర్థకశాఖ అధికారికి సూచించారు.
జిల్లాలోని ఉద్యానవనశాఖలో 38 పోస్టులకుగాను 7 పోస్టులు మాత్రమే ఉన్నాయని, మిగిలిన పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయాలన్నారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద డ్రిప్పై షెడ్యూల్డ్ తెగల వారికి 100 శాతం, వెనుకబడిన తరగతుల వారికి 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీలను ఇస్తున్నామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు, దివ్యాంగులకు అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యం కింద పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.మహిళా సంక్షేమంపై జడ్పీ సీఈవో దిలీప్కుమార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1 నుంచి అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభమైనందున పిల్లల ఎత్తు, బరువు ఎప్పటికప్పుడు కొలువాలన్నారు. అనీమియా వ్యాధి రాకుండా ఉండేందుకు గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పిల్లల పెరుగుదలకు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పారు. బాల్య వివాహాలు జరుగకుండా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు రోడ్లపై తిరుగకుండా చైల్డ్ లైన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
స్థాయి సంఘం-6 సాంఘిక సంక్షేమ కార్యక్రమాలపై డిప్యూటీ సీఈవో రంగారావు మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీల గురుకుల వసతి గృహాల్లో చేరే విద్యార్థులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పటిష్టమైన భద్రత కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహాలకు వాచ్మెన్ ఉన్నారా…? అని అడిగి తెలుసుకున్నారు. వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే వాటిని తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయాలన్నారు. స్థాయి సంఘాల సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని బీసీ సంక్షేమశాఖ అధికారిని ఆదేశించారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, పశుసంవర్థకశాఖ అధికారి అంజిలప్ప, సంక్షేమాధికారి మోతి, మైనార్టీ సంక్షేమాధికారి రత్నకల్యాణి, గిరిజన సంక్షేమాధికారి రామేశ్వరి, అటవీశాఖ అధికారి ఆనంద్రావు, మార్క్ఫెడ్ అధికారి తహ్మీనా, కో ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శాంతాబాయి, జడ్పీటీసీలు వెంకటేశ్, అనురాధ, స్వరూప, విశాల, నిత్య, జంగారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.