రంగారెడ్డి, జూలై, 20, (నమస్తే తెలంగాణ): వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులతోపాటు భూముల విలువను పెంచుతూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును రూ.7.5 శాతానికి పెంచగా.. వ్యవసాయ భూముల కనిష్ఠ మార్కెట్ విలువ ఎకరాకు రూ.75 వేలుగా నిర్ణయించారు. వ్యవసాయ భూముల మార్కెట్ విలువను మూడు స్లాబుల్లో 50 శాతం, 40 శాతం, 30 శాతం మేర పెంచింది. అంతేకాకుండా అపార్ట్మెంట్ల ప్లాట్ల చదరపు అడుగు కనీస విలువను రూ.800 నుంచి రూ.1000కి పెంచింది. చదరపు అడుగుపై 20 శాతం, 30 శాతం మేర పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.
భూముల విలువ పెంపు జిల్లాలో ఇలా….
వ్యవసాయ భూముల మార్కెట్ విలువను మూడు స్లాబుల్లో పెంచారు. ఉదాహరణకు జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీలోని 946 సబ్ డివిజన్లలో ఇప్పటివరకు మార్కెట్ విలువ రూ.14 లక్షలు ఉండగా, రూ.19.60 లక్షలకు, 232 సబ్ డివిజన్లలో రూ.19 లక్షలు ఉండగా.. రూ.26.60 లక్షలకు, 404 సబ్ డివిజన్లలో రూ.20 లక్షలుగా ఉన్న మార్కెట్ విలువను రూ.28 లక్షలకు.. ఇలా ఒక్కో మండలంలో మూడు స్లాబుల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువను పెంచారు. ఇదే మండలంలోని మన్నెగూడ గ్రామ పంచాయతీలోని 432 సబ్ డివిజన్లలో ప్రస్తుతం రూ.34 లక్షలుగా ఉన్న మార్కెట్ విలువను రూ.47.60 లక్షలకు, 71 సబ్ డివిజన్లలో రూ.38 లక్షలుండగా రూ.53.20 లక్షలకు, మరో 108 సబ్ డివిజన్లలో వ్యవసాయ భూముల విలువ రూ.40 లక్షలుగా ఉండగా రూ.56 లక్షలకు పెంచారు. చేవెళ్ల మండలంలోని చేవెళ్ల గ్రామ పంచాయతీలోని 2356 సబ్ డివిజన్లలో రూ.5.50 లక్షలుండగా, ప్రస్తుతం రూ.8.25 లక్షలకు, 326 సబ్ డివిజన్లలో రూ.15 లక్షలుగా ఉన్న మార్కెట్ విలువను రూ.21 లక్షలకు పెంచారు.
ఫరూఖ్నగర్ మండలం ఫరూఖ్నగర్లోని 801 సబ్ డివిజన్లలో రూ.72.60 లక్షల నుంచి రూ.1.64 కోట్లు, 330 సబ్ డివిజన్లలో రూ.1.21 కోట్ల నుంచి రూ.1.57 కోట్లకు పెంచారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఇబ్రహీంపట్నం ఖల్సాలోని 10,570 సబ్ డివిజన్లలో రూ.6 లక్షల మార్కెట్ విలువను రూ.9 లక్షలకు, మరో 82 సబ్ డివిజన్లలో రూ.12 లక్షల నుంచి రూ.16.80 లక్షలకు పెంచారు. మొయినాబాద్ మండలం హిమాయత్నగర్లో రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షలకు, రూ.40 లక్షలుగా ఉన్న మార్కెట్ విలువను రూ.56 లక్షలకు పెంచారు.