కులకచర్ల, ఆగస్టు 4: గర్భిణీలు రక్తహీనతను ఎదుర్కొనకుండా గర్భం దాల్చిన మూడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు పోలిక్ యాసిడ్, ఐరన్ ట్యాబ్లెట్లు వేయించాలని మం డల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, సీహెచ్వో చంద్రప్రకాశ్ తెలిపారు. బుధవారం కులకచర్ల దవాఖానాలో ఏఎన్ఎంల కు, అంగన్వాడీ టీచర్లకు, ఆశవర్కర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రా మాల్లో గర్భిణీలు చాలా వరకు రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్నారని, డెలివరీ సమయంలో రక్తహీనతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు వారి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్ర పోలిక్ యాసిడ్, ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా ప్రసవ సమయంలో రక్తహీనత సమస్య ఎదురుకాకుండా ఉంటుందని తెలిపారు.ఆకుకూరలు, పండ్లు, కోడిగుడ్లు బాగా తినడం ద్వారా పిండం బాగా పెరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి నెల ఒక్కొ క్కరికి 30 కోడి గుడ్లు ప్రభుత్వం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. బియ్యం, పప్పులు, నూనెలు కూడా ఇండ్లకు పంపిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలకు ప్రసవ సమయంలో తప్పని సరిగా హిమోగ్లోబిన్ శాతం 11 నుంచి 13 శాతం మధ్యలో ఉండాలన్నారు. హైరిస్కు ఉన్నవారిని ముందుగానే గుర్తించి పెద్ద ఆసుపత్రికి పంపించడం ద్వారా తల్లిబిడ్డా క్షేమంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో పలువురు ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.