ఇబ్రహీంపట్నం, జూలై 18: అబ్దుల్లాపూర్మెట్ మండలంలో పిగ్లీపురం నూతనంగా ఏర్పడిన పంచాయతీ. భౌగోళికంగా ఈ గ్రామం చాలా చిన్నది. గతంలో ఈ గ్రామం బాటసింగారం పంచాయతీకి అనుబంధంగా ఉండేది. పల్లె ప్రగతి కార్యక్రమంతో రెండేండ్లలో గ్రామంలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సీసీరోడ్లు, ఆహ్లాదాన్నిచ్చే పచ్చని చెట్లు కనిపిస్తుంటాయి. ఈ గ్రామం మహా నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ సీమాంధ్ర పాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ గ్రా మం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గ్రామంలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీ లు, ఇంటింటికీ నల్లానీరు, రోడ్లకు ఇరువైపులా ఆహ్లాదాన్ని పంచే హరితహారం చెట్లు కనువిందు చేస్తుంటాయి. గ్రామంలో ప్రతిరోజు రోడ్లను శుభ్రం చేయడంతో పాటు పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించి, డంపిగ్యార్డుకు తరలించి, కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారు. అనంతరం ట్యాంకర్ ద్వారా హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్లకిరువైపులా, ఖాళీస్థలాల్లో నాటిన మొక్కలకు నీటిని అందజేస్తున్నారు. నూతన పంచాయతీకి మొదటి సర్పంచ్గా గెలుపొందిన తోట రాధా లక్ష్మారెడ్డి గ్రామాభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా ఎమ్మెల్యే కిషన్రెడ్డి సహకారంతో అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారు.
హరితహారంలో అగ్రగామి పిగ్లీపురం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన హరితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఈ గ్రామం అగ్రగామిగా నిలిచింది. గ్రామస్తులు పట్టుదలతో సర్పంచ్ సహకారంతో ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటారు. గతంలో హరితహారంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి గ్రామంలో పచ్చందాలు నెలకొన్నాయి. హరితహారంలో నాటిన మొక్కలకు నీటిని అందిం చి, వాటిని కాపాడేందుకు కంచె ఏర్పాటు చేయించారు. రూ.12.60లక్షలతో వైకుంఠధామం, రూ.2.60లక్షలతో వర్మీ కంపోస్టు యార్డు, రూ.10లక్షలతో సీసీ రోడ్లు, రూ.3లక్షలతో యూజీడీ నిధులతో అభివృద్ధి పనులు చేశారు.
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు
గతంలో పిగ్లీపురం గ్రామానికి వెళ్లాలంటే సరైన రోడ్డుమార్గం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బాటసింగారం సమీపంలో ఏర్పాటు చేసిన లాజిస్టిక్ పార్కు వరకు, పిగ్లీపురం గ్రామానికి రెండులేన్ల రోడ్డు ఏర్పాటు చేశారు. నేషనల్హైవే – 65 నుంచి కొత్తగుడం మీదుగా లాజిస్టిక్ పార్కు నుంచి పిగ్లీపురం వరకు రెండు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.50లక్షల వ్యయం చేశారు. దీంతో ఈ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండులేన్ల రోడ్డు రావడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి.
ఎకరాల స్థలంలో పల్లె ప్రకృతి వనం
ప్రభుత్వం ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనాలను నిర్మించాలని ఆదేశించిన నేపథ్యంలో అబ్దుల్లాపూర్మెట్ మండలంలో పిగ్లీపురం గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ గ్రామంలో ఎకరా స్థలంలో పల్లె ప్రకృతి వనంతో పాటు నర్సరీ ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. నూతన గ్రామపంచాయతీ ఏర్పడిన అతితక్కువ కాలంలోనే ఎమ్మెల్యేకిషన్రెడ్డి సమకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాం. ప్రతి కాలనీలో సీసీరోడ్లు,డ్రైనేజీలు వేయించడంతో పాటు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర మరువలేనిది.
– తోట రాధా లక్ష్మారెడి, సర్పంచ్, పిగ్లీపురం
ప్రతిరోజు పారిశుధ్య పనులు
పిగ్లీపురం గ్రామాన్ని అభివృద్ధితో పాటు పారిశుధ్యంలో అగ్రగామిగా నిలిపేందు కోసం ప్రతిరోజు సర్పంచ్ సహకారంతో గ్రామపంచాయతీ కార్మికుల కృషితో రోడ్లను శుభ్రం చేయడం, మురుగుకాల్వలు శుభ్రం చేయడం, చెట్లకు నీటిని అందించడం, ఇంటింటికి చెత్తసేకరణ పనులు ముమ్మరంగా చేపడుతున్నాం. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషచేస్తున్నాం.