ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నం రూరల్, జూలై 22 : ఐటీ పురపాలకశాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని తులేకలాన్, గున్గల్ అటవీ ప్రాంతంలో రెండులక్షల మొక్కలు నాటేందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శ్రీకారం చుట్టారు. మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో గున్గల్, తులేకలాన్ అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో రెండులక్షల మొక్కలు నాటడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా మూడులక్షల మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలో అధికారులు సమన్వయంతో గుంతలు తీసే కార్యక్రమంతో పాటు మంత్రి పర్యటన దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రోచర్ విడుదల చేసిన ఎమ్మెల్యే..
ముక్కోటి వృక్షార్చనకు సంబంధించిన బ్రోచర్ను గురువారం ఎమ్మెల్యే మంచిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డుమెంబర్లు, పార్టీ మండల, గ్రామశాఖ బాధ్యులు, కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
అటవీశాఖ ఆధ్వర్యంలో గుంతలు..
మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా తులేకలాన్ అటవీ ప్రాంతంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఉపాధిహామీ కూలీలతో పాటు దినసరి కూలీలతో గుంతలు తీయిస్తున్నారు.
వృక్షార్చనను విజయవంతం చేయాలి
ఈ నెల 24న చేపడుతున్న ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేశ్గౌడ్, భాష ఒక ప్రకటనలో కోరారు. మండలంలోని గున్గల్ ఫారెస్టులో 24వ తేదీ ఉదయం 10గంటలకు ముక్కోటి వృక్షార్చనలో భాగంగా లక్ష మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.