పరిగి, జూలై 18 : గ్రామీణ బాలికల్లో ఆత్మైస్థెర్యం పెంపొందించడమే తమ లక్ష్యమని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్రెడ్డి సతీమణి సీతా రంజిత్రెడ్డి పేర్కొన్నారు. బాలికల్లో పాఠశాలల స్థాయి నుంచి నైపుణ్య వికాసానికి ఉపయోగపడే స్పోకెన్ ఇంగ్లీష్పై జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా పరిగి నియోజకవర్గ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలిక వికాస గురుకుల విద్యార్థులకు ఈ నెల 13 నుంచి 18 వరకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించారు. నియోజకవర్గంలోని పరిగి, కులకచర్ల, దోమ, గండీడ్ గురుకులాల ప్రిన్సిపాల్ల పర్యవేక్షణలో ఈ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థినుల్లో ఆంగ్లం అనే భయం పోగొట్టడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.
దీంతోపాటు వారిలో దాగివున్న సృజనాత్మకతను, ఆలోచనలను పంచుకునేందుకు ఈ వర్క్షాప్ ఎంతగానో ఉపయోగపడిందని ఆమె పేర్కొన్నారు. పాఠశాలలు పునః ప్రారంభమైన తర్వాత ప్రతి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇలాంటి తరగతులు నిర్వహిస్తామని సీత వెల్లడించారు. ఆంగ్ల భాషపై సుమారు 20 సంవత్సరాల అనుభవం కలిగిన నిపుణులచే వర్క్షాప్ నిర్వహించినట్లు ఫిక్కీ చైర్పర్సన్ ఉమ చిగురుపాటి తెలిపారు. ఆంగ్ల భాషా నిపుణులు సౌమ్య, స్మిత, శిల్పరాజు ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో నాలుగు మండలాల కస్తూర్బాగాంధీ గురుకులాల ప్రిన్సిపాల్లు దేవి, సబియా సుల్తానా, మంగమ్మ, లక్ష్మీబాయి పాల్గొన్నారు.