ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 12 : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో మున్సిపాలిటీ పరిధిలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పెట్టింది పేరన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, తహసీల్దార్ అనిత, ఎంపీడీవో మహేశ్బాబు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భరత్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఉత్సాహంగా బతుకమ్మ సంబురాలు
అబ్దుల్లాపూర్మెట్, ఆక్టోబర్ 12 : మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీపీ రేఖ హాజరై ప్రారంభించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించి పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీవో వినోద, సర్పంచ్లు రాధ, లావణ్య, సుజాత, ఎంపీటీసీ లావణ్య, మహిళా సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీపీ వైద్యాధికారి శ్వేత, ఏఎన్ఎంతో కలిసి బతుకమ్మ ఆడారు.
యాచారంలో..
యాచారం, అక్టోబర్ 12 : మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ సుకన్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. జానపద కళాకారుడు జంగిరెడ్డి బృందం జానపదం, ఆధ్యాత్మికం, బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ దుమ్మురేపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఆశ వర్కర్లు, ఉద్యోగులు కోలాటమాడుతూ ఆకట్టుకున్నారు. బతుకమ్మ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీలత, సూపరింటెండెంట్ శైలజ, పశువైద్యాధికారి వనజ, సహకార సంఘం డైరెక్టర్లు స్వరూప, శశికళ, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బాషా, సర్పంచ్ పెద్దయ్య పాల్గొన్నారు.
ఆడిపాడిన విద్యార్థినులు
కడ్తాల్, అక్టోబర్ 12 : మండలంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం మండల కేంద్రంలోని గీతం డిగ్రీ కళాశాల, న్యూ బ్రిలియంట్ జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మ బతుకమ్మ.. ఉయ్యాలో బంగారు బతుకమ్మ.. ఉయ్యాలో , ‘చిత్తూ, చిత్తుల బొమ్మ.. శివునీ ముద్దూలగుమ్మ.. అని పాటలు ఆలపిస్తూ విద్యార్థినులు ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. వేడుకల్లో కళాశాల నిర్వాహకులు రఘుపతిరెడ్డి, నరేందర్రెడ్డి, శ్రీశైలం, అధ్యాపక బృందం పాల్గొన్నారు.