షాబాద్, అక్టోబర్ 25 : యాసంగిలో పండించే వరిని భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ)కొనుగోలు చేయడం లేనందున, వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మండల వ్యవసాయాధికారులు గ్రామాల్లో పంటల సాగుపై పక్కా ప్రణాళికలు తయారుచేసి, రైతులు యాసంగి సీజన్లో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయంగా శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, ఆముదాలు, ధనియాలు, కుసుమలు, భూముల లక్షణాలకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఏవోలు, ఏఈవోలతో మండలాలవారీగా కలెక్టర్ సమీక్షించారు.
ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు అందుబాటులో ఉన్న విత్తనాల గురించి రైతులకు తెలియజేయాలన్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు జిల్లాలో ఉన్న 83 రైతు వేదికల్లో క్లస్టర్లవారీగా ప్రత్నామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించి.. 29న క్లస్టర్లవారీగా యాసంగి పంట ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. రైతులందరూ రైతు వేదిక సమావేశాల్లో పాల్గొనేలా చూడాలని అధికారులకు సూచించారు. అన్ని రైతు వేదికల్లో నవంబర్ చివరివరకు వారంలో కనీసం రెండుసార్లు ప్రత్నామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని.. ప్రతి సమావేశంలో 200 మంది రైతులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మిగతా రోజుల్లో ఏఈవోలు వారి పరిధిలోని గ్రామాలను సందర్శించి ప్రత్నామ్నాయ పంటలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.
ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉండి పంటల సాగులో వారికి తగిన సలహాలు, సూచనలు చేయాలని, విత్తనాల నాణ్యతపై, పంటలకు మార్కెట్లో ఉండే ధరలు, వచ్చే లాభాల గురించి పూర్తి వివరాలు స్పష్టంగా రైతులకు చెప్పాలని, శాస్త్రవేత్తలతో సాగు పద్ధతులను వివరించాలన్నారు. రాష్ట్ర రాజధాని సమీపంలో ఉన్న రంగారెడ్డిజిల్లా ఉన్నందున కూరగాయలు, పండ్లు పండించేలా రైతులను ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ అధికారిని ఆదేశించారు. మండల, డివిజన్ వ్యవసాయ అధికారులు వారి ఆధ్వర్యంలో ఉన్న రైతు వేదికల్లో నిర్వహించే సమావేశాల్లో పాల్గొని రైతులకు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారిని నియమించాలని, వారు కూడా మండల సమావేశాల్లో పాల్గొని రైతులకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తిరుపతిరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సునంద, క్రీడా శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ శేఖర్, సివిల్ సప్లయ్ అధికారి మనోహర్ రాథోడ్, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, వ్యవసాయ శాఖ ఆయా మండలాల ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.