పరిగి, సెప్టెంబర్ 27 : కొండా లక్ష్మణ్ బాపూజీ అలుపెరగని తెలంగాణ పోరాట యోధుడని బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ తెలిపారు. సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపూజీ ప్రజల అభ్యున్నతికి, దేశం కోసం పనిచేశారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, దేశానికి, రాష్ర్టానికి చేసిన సేవలను మననం చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, డీటీడీవో కోటాజీ, డీఎస్సీడీవో మల్లేశం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, అధికారులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత బాపూజీ
ప్రజాస్వామ్యవాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జానకీరెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుభాషిణి, సూపరింటెండెంట్లు ఉషా, చెన్నారెడ్డి పాల్గొన్నారు.
కొండాలక్ష్మణ్ సేవలు మరువలేనివి
కొండా లక్ష్మణ్బాపూజీ చేసిన సేవలు మరువలేనివని మండల కేంద్ర గ్రంథపాలకుడు యాదగిరి పేర్కొన్నారు. సోమవారం గ్రంథాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు ఖాజా పాషా మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాటం చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు కె.నర్సింహులు, అశోక్, లక్ష్మణ్ విద్యార్థులు పాల్గొన్నారు.
మర్పల్లి మండల కేంద్రంలో..
మండల కేంద్రంలోని గ్రంథాలయంలో వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఫసీయుద్దీన్ మండల నాయకులతో కలిసి సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలితరం ఉద్యమకారుడిగా, నిబద్ధత కలిగిన రాజకీయవేత్తగా, మంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు సొహెల్, నాయకులు వసంత్కుమార్, సిబ్బంది రాజు పాల్గొన్నారు.
తాండూరు పట్టణంలో..
తాండూరు రూరల్, సెప్టెంబరు 27 : తాండూరు పట్టణంలో కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు. బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని గంజ్ అసోసియేషన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు.