మర్పల్లి, జూలై 25 : ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలను చేపట్టారు. సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దుకోవాలన్న పట్టుదలతో అభివృద్ధిపై దృష్టిసారించారు. మండలంలోని పెద్దాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పాలకవర్గం పల్లె ప్రగతి పనులు స్వల్పకాలంలోనే పూర్తిచేసింది. గ్రామంలో మొత్తం జనాభా 1248 మంది ఉండగా, పురుషులు 600 మంది, 648 మంది మహిళలు ఉన్నారు. పెద్దాపూర్తో పాటు అనుబంధ గ్రామంలో స్తంభాలకు ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. రైతుల పొలాలకు వెళ్లేందుకు, మాలసోమారం శివారు వరకు ఫార్మిషన్ రోడ్డు వేయించారు. గ్రామంలో 80 శాతం సీసీ రోడ్లు, 100 శాతం మరుగుదొడ్లు నిర్మించారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. చెత్త బుట్టలను అందజేసి తడి,పొడి చెత్తను వేరుచేసి ట్రాక్టర్ ద్వారా సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. పల్లెప్రగతిలో కంపోస్టుషెడ్, డంపింగ్యార్డు, వైకుంఠధామం నిర్మించారు. హరితహారంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ట్రీగార్డ్లను ఏర్పాటు చేశారు. దీంతో అవి ఏపుగా పెరిగి మంచి వాతావరణాన్ని అందిచడంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనాలు..
పెద్దాపూర్తో పాటు అనుబంధ గ్రామం కుడుగుంటలో రెండు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. గ్రామ సమీపంలో సర్వేనంబర్ 109లోని ఎకరం స్థలంలో 34 రకాల 4వేల మొక్కలు నాటారు. అలాగే అనుబంధ గ్రామమైన కుడుగుంటలో 20 గుంటల స్థలంలో 16 వందల మొక్కలు పెంచుతున్నారు. వాటికి ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పడుతున్నారు.
రూ.48 లక్షలతో అభివృద్ధి పనులు
అధికారుల సూచనలు పాటించి పల్లె ప్రగతి అభివృద్ధి పనులను పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో పూర్తిచేశాం. రూ.48 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, రూ.50 వేలతో డంపింగ్యార్డు, రూ. 2.36 వేలతో కంపోస్టుషెడ్, రూ.3లక్షల జీపీ నిధులతో ఫార్మిషన్ రోడ్డు, కుడుగుంటలో రూ.5లక్షలతో మురుగు కాలువ నిర్మించాం. రూ.9.42 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేశాం. రెండు గ్రామాల్లో రూ.4 లక్షలతో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.
-జనార్ధన్, పంచాయతీ కార్యదర్శి, పెద్దాపూర్
అందరి సహకారంతో అభివృద్ధి
ప్రభుత్వం ఎంతో ప్రాతిష్ఠాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతితో గ్రామం అభివృద్ధి చేశాం. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాలకతీతంగా ముందుకెళ్లి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. పెద్దాపూర్తో పాటు అనుబంధ గ్రామం కుడుగుంటలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను నాటాం. కార్మికులతో ప్రతి రోజూ ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం.
-ఉమారాణి గోపాల్రెడ్డి, సర్పంచ్, పెద్దాపూర్