వికారాబాద్, సెప్టెంబర్ 27 : వికారాబాద్ అనంతగిరిని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఊటీగా అభివర్ణించారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ గుర్తు చేశారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వికారాబాద్ అనంతగిరిలోని హరిత రిసార్ట్స్లోని కాన్ఫరెన్స్హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనంతగిరిలో పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్థానికులదేనన్నారు. ఇక్కడికి ప్రతి శని, ఆదివారాల్లో పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారన్నారు. ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు అనంతపద్మనాభస్వామిని దర్శించుకుంటారన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అనంతగిరి అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయన్నారు. ఈ ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా తీర్చిదిద్దాలని కోరారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, రాబోయే కాలంలో జిల్లాను పర్యాటక కేంద్రంగా చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. అనంతగిరి హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నందున చాలా మంది పర్యాటకులు ఇక్కడికి ట్రెక్కింగ్, దైవదర్శనంతో పాటు ప్రకృతిని ఆస్వాదించడానికి వస్తుంటారన్నారు. అటవీప్రాంతంలో లక్షల మొక్కలు నాటడం జరిగిందని, ఔషధమొక్కలు కూడా ఉన్నందున చెట్లను నరకకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం సాంస్కృతిక సారథి కళాకారులతో కలిసి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటక రంగం ఆవశ్యకతపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా యువజన క్రీడల అధికారి హన్మంత్రావు, డీఈవో రేణుకాదేవి, జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవ్, సంక్షేమ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.