సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ : అవి వంద ఏండ్ల కిందట నిర్మించిన స్వచ్ఛమైన తాగునీటి సరస్సులు. హైదరాబాద్ను వరదలు ముంచెత్తినప్పుడు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1908లో హైదరాబాద్ ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతాకిడి అదుపు చేయడంతోపాటు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్ తలపాగలాగ హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లను నిర్మించారు. అయితే అవి పూర్తిస్థాయిలో నిండి మత్తడి దూకి గేట్లు తెరుచుకుంది మాత్రం ఓ పది పదిహేను సార్లు మాత్రమే. కానీ గత రెండేండ్లుగా హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ పూర్తిస్థాయిలో నిండాయి. హైదరాబాద్ మహానగర శివారులోని ఈ జంట జలాశయాల్లో జలసవ్వడి కనువిందు చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలకరి పలుకరించిన కొద్ది రోజుల్లోనే హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటడంతో మంగళవారం సాయంత్రం స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు హిమాయత్సాగర్ మూడు గేట్లను ఒక ఫీటు ఎత్తు వరకు ఎత్తి నీటిని ఈసీ నది ద్వారా దిగువలోని మూసీ నదిలోకి నీటిని తరలిస్తున్నారు.
హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు (2.97 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1762.90 (2.773 టీఎంసీలు) ఉందని, 1,250 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1030 అవుట్ ఫ్లో కొనసాగుతుందని జలమండలి అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలకరి ఆరంభంలోనే పరవళ్లు తొక్కడంతో హిమాయత్సాగర్ అందాలను తిలకించేందుకు సమీప ప్రాంతాల నుంచి సందర్శకుల తాకిడి పెరిగింది. అలాగే ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు (3.90 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1784.70 అడుగులు (2.782 టీఎంసీలు) ఉందని, 120 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదని జలమండలి అధికారులు తెలిపారు. ఉస్మాన్ సాగర్ కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
కార్యక్రమంలో మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్కుమార్, సీఐ కనకయ్య, జలమండలి అధికారులు, కార్పొరేటర్లు ముద్దం రాములు, నాయకులు బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్గౌడ్, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు : దానకిశోర్, ఎండీ, జలమండలి
హిమాయత్నగర్ 3 గేట్లను ఒక ఫీటు మేర ఎత్తిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. జలమండలి సిబ్బంది హిమాయత్సాగర్, ఈసీ, మూసీ నది పరీవాహక ప్రాంతాలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలెవ్వరూ కాలువల వద్దకు వెళ్లవద్దు. నగరంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా మ్యాన్హోళ్లకు సేఫ్టీగ్రిల్స్, ఎర్రజెండాలను ఏర్పాటు చేశాం. నగరంలో ఎమర్జెన్సీ బృందాలు తిరుగుతున్నాయి. వానలు పడే అవకాశమున్న నేపథ్యంలో పరిస్థితిని నిత్యం సమీక్షించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతోపాటు జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించాం.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించిన మహా చండీయాగంతో అన్ని చెరువులు, కుంటలు జలకళతో నిండుకుండలా మారాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాల నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంతో తాగునీరు అందరికి పుష్కలంగా సరఫరా అవుతున్నది. నాడు నగరానికి మంచినీటిని అందించే జంట జలాశయాలను మిషన్ భగీరథ రాకతో స్టోరేజీ రిజర్వాయర్లుగా మార్చారు.