వికారాబాద్, ఆగస్టు 4, (నమస్తే తెలంగాణ) : స్వయం సహాయక సంఘాల బలోపేతమే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలు అండగా నిలుస్తున్నాయి. ఆయా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు, వడ్డీ చెల్లింపులు, అప్పు వంటి లావాదేవీల స్థితిగతులను తెలుసుకునేందుకు కొంత ఆటంకం కలుగుతున్నది. కొన్నిచోట్ల సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. దీని వల్ల మహిళా సంఘాల అభివృద్ధికి విఘాతం కలిగే ప్రమాదం ఉంది. దీంతో సెర్ప్ పరిధిలో ఉన్న మహిళా సంఘాల వివరాలను యాప్లో పొందుపర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. అవకతవకల నిరోధంతో పాటు సభ్యులు తమ పొదుపు వివరాలు తెలుసుకునేందుకు ఐకేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఎస్హెచ్జీ అకౌంటింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో ఒక క్లిక్తో మహిళా సమాఖ్య సమగ్ర సమాచారం క్షణాల్లో కనిపించనుంది. జిల్లాలో సెర్ప్ అధికారులు నెలరోజులుగా ఇంటింటికీ వెళ్లి మహిళా సంఘాల సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు. వాటిని ఈ యాప్లో నమోదు చేస్తున్నారు. సభ్యురాలి ఫొటోను సైతం ప్రొఫైల్లో నిక్షిప్తం చేస్తున్నారు. భవిష్యత్లో ఏ సభ్యురాలికైనా రుణం కావాలంటే ఒక క్లిక్తో సమాచారం పరిశీలించవచ్చు. ఈ ప్రక్రియను జూలై 31న ముగించాల్సి ఉండగా.. మరో పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలున్నాయి.
95 శాతం వివరాలు నమోదు..
జిల్లాలోని 18 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 15,128 సంఘాల్లో లక్షా 50వేల మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 14,686 వేల ఎస్హెచ్జీలకు సంబంధించి లక్షా 47వేల మంది మహిళల (95 శాతం) వివరాలను యాప్లో పొందుపర్చారు. ఇంకా మిగిలి ఉన్న 442 ఎస్హెచ్జీల వివరాలను వచ్చే పది రోజుల్లో నమోదు చేసి పూర్తి చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. మహిళల ఆర్థిక పురోగతి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహాకాలు అందజేస్తుంది. సంఘాల్లోని సభ్యులకు పొదుపు ఆధారంగానే కాకుండా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కలిపిస్తోంది. బ్యాంకు లింకేజీతో పాటు స్త్రీ నిధి కింద స్వయం ఉపాధికి రుణాలు ఇప్పిస్తున్నది. ఇప్పటి వరకు పొదుపు సంఘాల లావాదేవీలను తెలుసుకోవాలంటే నెలవారీ నివేదిక రికార్డులను, వీవోలు, సీసీల ట్యాబ్ లేదా కంప్యూటర్లలో లాగిన్ అవ్వాల్సి వచ్చేది. ఆయా రికార్డుల్లోని చేతిరాత అర్థం కాక మహిళా సంఘాల సభ్యులు అధికారుల ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను తొలిగించేందుకు 2016లో ప్రతి గ్రామ సమాఖ్యకు ఒక ట్యాబ్ను అందించారు. అందులో సంఘం పరిధిలో లావాదేవీలను మాత్రమే నమోదు చేసేవారు. ట్యాబ్లో వీవోలు మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది. రోజురోజుకు వస్తున్న సాంకేతికను పొదుపు సంఘాల బలోపేతానికి ఉపయోగించేలా సెర్ప్ ఈ ఏడాది ఎస్హెచ్జీ అకౌంటింగ్ యాప్ను తెచ్చింది. ఈ యాప్తో ఐకేపీ సిబ్బందిపై పనిభారం కూడా తగ్గనున్నది.