మర్పల్లి, జూలై 2 : మండలంలోని పెద్దాపూర్ గ్రామాన్ని వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ శుక్రవారం సందర్శించి వైకుంఠధామం, అభివృద్ధి పనులను పరిశీలించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పల్లె ప్రగతిపై నిర్లక్ష్యం చేయకుండా సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో మార్కెట్ కార్యాలయంలో ఉన్న భవనాన్ని పరిశీలించి అందులోకి మార్చాలని తహసీల్దార్ తులసీరామ్కు సూచించారు. ధరణి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమారాణి, డైరెక్టర్ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి జనార్దన్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి
మర్పల్లి, జూలై 2 : పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ఎంపీపీ లలిత, జడ్పీటీసీ మధుకర్ అన్నారు. శుక్రవారం పల్లె ప్రగతిలో భాగంగా తిమ్మాపూర్, రావులపల్లి, పెద్దాపూర్, కల్ఖోడా, షాపూర్ గ్రామాలను ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో కలిసి సందర్శించారు. గ్రామాల్లో ఇండ్లపై నుంచి వేలాడుతున్న కరెంటు వైర్లను సరిచేయాలని, తుప్పు పట్టిన స్తంభాలుంటే వాటి స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. కల్ఖోడా గ్రామంలో మురుగు కాలువ, అంగన్వాడీ భవనానికి నిర్మాణాలకు జిల్లా పరిషత్ నుంచి నిధుల మంజూరుకు కృషి చేస్తానని జడ్పీటీసీ మధుకర్ తెలిపారు. పాడుబడిన బురుజును తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు, శేఖర్, ఉమారాణి, దేవమ్మ, శివకుమార్, సాలీబాయి, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ ఇబ్బందులు దూరం
కోట్పల్లి, జూలై 2 : పల్లె ప్రగతిలో భాగంగా రెండో రోజు పవర్ వీక్ అనే కార్యక్రమంలో శుక్రవారం మండలంలోని అన్ని పంచాయతీల్లో విద్యుత్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించారు. బార్వాద్ గ్రామంలో ఇండ్లపై నుంచి వేలాడుతున్న విద్యుత్ వైర్లను సిబ్బంది నరేశ్ పాల్గొని సరిచేశారు. గ్రామంలో హనుమాన్ మందిర్ దేవాలయం సమీపంలో ఉన్న మురుగు కాల్వ మరమ్మతు పనులు చేసే కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్యాదవ్, ఉపసర్పంచ్ సంగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం సందర్శన
తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ సందర్శించి, తహసీల్దార్ అష్వాక్ రసూల్తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. మీ సేవా సెంటర్లలో అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియం ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు.
మండలస్థాయి అధికారులతో సమీక్ష
కోట్పల్లి, జూలై 2 : పల్లె ప్రగతిలో భాగంగా మండల కార్యాలయాన్ని ప్రత్యేకాధికారి రాజేశ్వర్ సందర్శించి, కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించారా.. ఏవైనా ఇబ్బందులున్నాయా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఏపీవో అంజిలయ్య, కార్యదర్శులున్నారు.
మోమిన్పేట, జూలై 2 : మండల పరిధిలోని గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు జోరందుకున్నాయి. శుక్రవారం పాడుబడ్డ బావులు మూసివేయడం, ఇండ్లు కూల్చివేత, మురికి కాల్వల శుభ్రత పనులను చేపట్టారు.