షాద్నగర్, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ విమర్శించారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలను అమ్మడం, ఇష్టానుసారంగా ధరలు పెంచడం తప్ప బీజేపీ దేశానికి ఒరగబెట్టింది ఏమీలేదన్నారు. ఏడేండ్లలో కనీసం లక్ష ఉద్యోగాలైన ప్రధాని మోదీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు చెప్పాలన్నారు. కేవలం ఉనికిని కాపాడుకునేందుకు బీజేపీ పాదయాత్రలు, సభలను నిర్వహిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర పాలనపై అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో నిర్వహించిన ఫరూఖ్నగర్ మండలం, షాద్నగర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల విసృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతన కమిటీల్లో స్థానం పొందిన ప్రతి నాయకుడు పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. ఫరూఖ్నగర్ మండలం, షాద్నగర్ మున్సిపాలిటీ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, కమిటీ ఎన్నికల ఇన్చార్జి నాగేందర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత నారాయణ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాంబాల్నాయక్, రాజవరప్రసాద్, పాతూరి వెంకట్రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.
ఫరూఖ్నగర్ మండలాధ్యక్షుడిగా లక్ష్మణ్నాయక్, మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఎంఎస్. నటరాజన్
టీఆర్ఎస్ ఫరూఖ్నగర్ మండల నూతన కమిటీ అధ్యక్షుడిగా లక్ష్మణ్నాయక్ను నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రకటించారు. మండల మహిళా అధ్యక్షురాలిగా సుష్మారెడ్డిని నియమించారు. షాద్నగర్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఎంఎస్. నటరాజన్ మరోసారి ఎన్నికయ్యారని చెప్పారు. మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శింగా చీపిరి రవియాదవ్ నియమితులయ్యారని తెలిపారు. ఎన్నికైన అధ్యక్షులను ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులు అభినందించారు.
సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సంబంధితశాఖ అధికారులు కృషిచేయాలని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండలకేంద్రంలోని మండలపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి సమక్షంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరయ్యారు. ఎంపీపీ సమక్షంలో ఆయా శాఖ అధికారులు సంబంధిత శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చదవి వివరించారు. సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో సైతం గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో సురేశ్బాబు, జడ్పీటీసీ శ్రీలత, వైస్ఎంపీపీ శోభ, మండలాధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎంపీడీవో జ్యోతికి సన్మానం
కొత్తూరు ఎంపీడీవో జ్యోతికి డిప్యూటీ సీఈవోగా ఉద్యోగోన్నతి రావడంతో కొత్తూరు మండల కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఎంపీడీవో జ్యోతిని పూలమాల, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డిప్యూటీ సీఈవోగా వెళ్లడం ఎంతో సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, వైస్ ఎంపీపీ శోభ, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.